Leading News Portal in Telugu

నవంబర్ 11న ఏపీ బడ్జెట్ | andhrapradesh budget on november 11th| finance| minister| payyavula| keshav| assembly| session| dates| fix| priorities| super| six


posted on Oct 29, 2024 2:07PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 11న చంద్రబాబునాయుడి ప్రభుత్వం పూర్తి స్థయి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. తద్వారా కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టడం లేదనీ, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం లేదనీ చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టనుంది. ఇప్పటికే   బడ్జెట్‌ రూపకల్పన తుది దశకు చేరుకుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తన తొలి బడ్జెట్ ప్రసంగానికి రెడీ అయిపోయారు. ఈ సారి బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఆ మేరకు ఆదాయం సాధ్యాసాధ్యాలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నది. ప్రజలపై భారం మోపకుండా ఆదాయాన్ని రాబట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇప్పటికే ఆర్థిక శాఖను చంద్రబాబు ఆదేశించారు 

అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. గత వైసీపీ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను సమర్పించింది. మొత్తం రూ.2,86,389 కోట్లకు బడ్జెట్‌ సమర్పించారు.  2024 ఏప్రిల్‌ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి మొత్తం 40 గ్రాంట్ల కింద రూ. 1,09,052.34 కోట్లకు గత ప్రభుత్వం శాసనసభ ఆమోదం తీసుకుంది. ఆ తరువాత ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి జూన్ నెలలో అధికార పగ్గాలను చేపట్టింది.  

ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా ఉన్న కారణంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జులైలో మరోసారి ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ కు ఆమోదం తీసుకుని,  ఆగస్టు మూడు నుంచి నవంబర్ వరకూ నాలుగు నెలల కాలానికి  రూ.1,29,972.97 కోట్లతో 40 గ్రాంట్ల కింద రెండో తాత్కాలిక బడ్జెట్‌కు గవర్నర్‌ఆమోదం పొందింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  ఎనిమిది నెలల పాటు ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ తోనే . మొత్తం 8 నెలల కాలం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ తోనే గడిపేసింది.