Leading News Portal in Telugu

TDP Senior Leader and Former Minister Reddy Satyanarayana is No More


  • తెలుగుదేశం పార్టీలో విషాదం..

  • మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత..

  • సంతాపం తెలిపిన సీఎం.. స్పీకర్.. మంత్రులు..
Reddy Satyanarayana: టీడీపీలో విషాదం.. మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత.. సీఎం, మంత్రుల సంతాపం

Reddy Satyanarayana: తెలుగుదేశం పార్టీ మరో సీనియర్‌ నేతను కోల్పోయింది.. పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు.. ఆయన వయస్సు 99 ఏళ్లు.. ఈ రోజు ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో తుదిశ్వాస విడిచారు రెడ్డి సత్యనారాయణ.. గత కొంతకాలంగా వయసురీత్య, మరోవైపు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన.. ఈ రోజు మృతిచెందారు.. అయితే, స్వర్గీయ ఎన్టీఆర్‌ హయాంలో మంత్రిగా సేవలు అందించారు.. మాడుగుల నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగిన ఆయన.. తిరుగులేని విజయాలను అందుకున్నారు.. ఇక, ఆయనను మంత్రిని చేసిన ఎన్టీఆర్‌.. పశుసంవర్ధక శాఖ బాధ్యతలు అప్పగించారు.. ఆ శాఖ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సహా పలువురు మంత్రులు.. వివిధ పార్టీలకు చెందిన నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. ఇక, రేపు (బుధవారం) ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు.. రెడ్డి సత్యనారాయణ మృతిపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి సత్యనారాయణ ఎనలేని కృషి చేశారని కొనియాడారు.. మరోవైపు.. ఈ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతిని గురయ్యాను.. వారు పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు.. వారి మరణం పార్టీకి తీరనిలోటు.. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటుఊ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ గారి మృతి పట్ల సంతాపం తెలియజేశారు మంత్రి నారా లోకేష్.. ఐదుసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికై, మంత్రిగా ప్రజలకు చిరస్మరణీయ సేవలు అందించారు. నిరాడంబర ప్రజా సేవకుడిని పార్టీ కోల్పోయింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు..

ఇక, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత,మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి బాధాకరం. 5 సార్లు వరుసగా గెలిచిన ఎమ్మెల్యేగా, మంత్రిగా మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసి, నియోజకవర్గ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనం. రెడ్డి సత్యనారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. మరోవైపు.. మాజీ మంత్రి, సీనియర్ నాయకులు రెడ్డి సత్యనారాయణ గారి మృతి బాధాకరం.. మాడుగుల నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించిన రెడ్డి సత్యనారాయణ .. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నా.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు..