Leading News Portal in Telugu

Virat Kohli to Return to Ranji Trophy After 13 Years


  • రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమైన విరాట్ కోహ్లీ.
  • 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో పునరాగమనం.
  • కోహ్లీతో పాటు రంజీ ట్రోఫీలో ఆడనున్న మరికొంతమంది టీమిండియా ఆటగాళ్లు.
Virat Kohli: 13 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీ ఆడనున్న కింగ్ కోహ్లీ!

Virat Kohli: భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. రైల్వేస్‌తో ఢిల్లీ ఆడనున్న చివరి గ్రూప్ మ్యాచ్‌కు తాను అందుబాటులో ఉన్నట్లు కోహ్లీ ప్రకటించాడు. జనవరి 30న రైల్వేస్‌తో ఢిల్లీ తలపడనుంది. ఇది ఇలా ఉండగా.. కోహ్లీ చివరిసారిగా 2012లో ఉత్తరప్రదేశ్‌తో ఘజియాబాద్‌లో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీ ఢిల్లీకి మరోమారు ఆడబోతున్నాడు. 36 ఏళ్ల కోహ్లీ మెడ నొప్పి కారణంగా జనవరి 23 నుంచి సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్‌లో ఆడలేడని బీసీసీఐ వైద్య బృందానికి తెలిపాడు. అయితే, ఓ నివేదిక ప్రకారం అతను జనవరి 30 నుండి జరగనున్న ఢిల్లీ తదుపరి మ్యాచ్‌కు తన లభ్యత గురించి DDCA (ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్)కి తెలియజేశాడు.

ఢిల్లీ తరఫున కోహ్లీ 23 మ్యాచ్‌ల్లో పాల్గొని 50.77 సగటుతో 1574 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో ఢిల్లీకి ఆడుతున్న సమయంలో కోహ్లీ 5 సెంచరీలు చేశాడు. 2009-10 సీజన్‌లో కోహ్లీ 3 మ్యాచ్‌ల్లో 93.50 సగటుతో 374 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. జాతీయ జట్టులో కోహ్లి సహచరుడు రిషబ్ పంత్ కూడా 6 సంవత్సరాల తర్వాత రాజ్‌కోట్‌లో మైదానంలో రంజీ ట్రోఫీ కోసం అడుగు పెట్టనున్నాడు. మరోవైపు జమ్మూకశ్మీర్‌తో ముంబై ఆడే మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆడనున్నాడు. రంజీ ట్రోఫీ తదుపరి రౌండ్‌లో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజాలతో సహా ఇతర టీమిండియా క్రికెటర్లు కూడా తమ జట్లలో భాగం కానున్నారు. చూడాలి మరి రంజీ ట్రోఫీలో ఎంతమంది సీనియర్ ఆటగాళ్లు తిరిగి ఫామ్ అందుకుంటారో.