- భారతదేశ అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒక్కడిగా వృద్ధిమాన్ సాహా గుర్తింపు.
- క్రికెట్ కెరియర్లో చివరి మ్యాచ్ ఆడనున్న వృద్ధిమాన్ సాహా.
- గత ఏడాది నవంబర్లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్.
- ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్లో బెంగాల్ జట్టు తరపున చివరి మ్యాచ్.

Wriddhiman Saha: భారతదేశ అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడైన వృద్ధిమాన్ సాహా తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలకబోతున్నాడు. రంజీ ట్రోఫీ 2024-25 ఏడో రౌండ్ తర్వాత సాహా ఆటకు గుడ్బై చెప్పనున్నాడు. గత ఏడాది నవంబర్లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సాహా, అప్పట్లోనే ఈ రంజీ సీజన్ తన చివరిది అని తెలిపాడు. బెంగాల్ జట్టు ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్లో సాలిడ్ ప్రదర్శన చేయలేకపోయింది. 6 మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవగలిగింది. దీంతో క్వార్టర్ ఫైనల్స్కు చేరుకునే అవకాశాలు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో సాహా తన చివరి మ్యాచ్ను ఏడో రౌండ్లో ఆడనున్నాడు.
ఇక సాహా ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ లో 141 మ్యాచ్లలో 209 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసి 41.68 సగటుతో 7169 పరుగులు సాధించాడు. ఇందులో 14 శతకాలు, 44 అర్ధశతకాలు ఉన్నాయి. రంజీలో అతని అత్యధిక స్కోరు 203 పరుగులు నాటౌట్. ఇక సాహా అంతర్జాతీయ క్రికెట్లో భారీగా రాణించలేకపోయినా వికెట్ కీపింగ్లో మాత్రం అత్యుత్తమంగా నిలిచాడు. మొత్తం 40 టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఆయన 56 ఇన్నింగ్స్ల్లో 1353 పరుగులు చేసాడు. ఇందులో 3 శతకాలు, 9 అర్ధశతకాలు ఉన్నాయి. ఒకే టెస్ట్లో 10 క్యాచ్లు తీసిన తొలి భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా. సాహా తన ఫస్ట్ క్లాస్ కెరీర్కు ముగింపు పలుకుతున్నప్పటికీ, భారత క్రికెట్లో వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడిగా గుర్తుండిపోతాడు.