Leading News Portal in Telugu

March 18 Marks the Last ODI of Cricket Legends Sachin Tendulkar, Kumar Sangakkara, and Mahela Jayawardene


  • మార్చి 18 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు
  • టీమిండియాకు ఈరోజు చాలా చిరస్మరణీయం
  • మార్చి 18 సచిన్, సంగక్కర, జయవర్ధనేకు చివరి వన్డే.
March 18th: క్రికెట్ చరిత్రలో మార్చి 18 ‘స్పెషల్ డే’.. పాకిస్తాన్‌కు మాత్రం..!

మార్చి 18 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. టీమిండియాకు ఈరోజు చాలా చిరస్మరణీయమైనది. మార్చి 18.. ముగ్గురు దిగ్గజ క్రికెటర్లు తమ చివరి వన్డే మ్యాచ్ ఆడారు. వారిలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, శ్రీలంక మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కుమార్ సంగక్కర, మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ఉన్నారు. ఈ ముగ్గురు దిగ్గజ క్రికెటర్లు క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు. సచిన్ టెండూల్కర్ మార్చి 18, 2012న తన చివరి వన్డే ఆడాడు. శ్రీలంక క్రికెట్ దిగ్గజాలు కుమార్ సంగక్కర, మహేల జయవర్ధనే 2015లో జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్‌లో తమ చివరి వన్డేలు ఆడారు. ఈ ముగ్గురు క్రికెటర్లు 45,000 కంటే ఎక్కువ పరుగులు సాధించారు.

మార్చి 18 టీమిండియాకు ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే 2018లో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగిన నిదాహాస్ ట్రోఫీ ఫైనల్ ఆ రోజు జరిగింది. ఈ ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్ మ్యాచ్ టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య జరిగింది. ఆ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ చివరి బంతికి సిక్స్ కొట్టి ఇండియాను గెలిపించాడు. ఈ టోర్నమెంట్ శ్రీలంక స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించారు.

మరోవైపు.. 2007 మార్చి 18 పాకిస్తాన్ క్రికెట్‌కు చీకటి రోజు. ఇదే రోజు పాకిస్తాన్ జట్టు హెడ్ కోచ్ బాబ్ వూల్మర్ మరణించారు. 2007 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్ తరువాత.. బాబ్ వూల్మర్ హోటల్ గదిలో చనిపోయినట్లు గుర్తించారు. ఈ క్రమంలో.. పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లను చాలా రోజులు విచారించారు. జమైకా పోలీసులు ఈ కేసును హత్య కోణంలో దర్యాప్తు చేశారు. అనుమానాస్పదంగా ఏమీ గుర్తించలేదు. ఈ రకంగా మార్చి 18 టీమిండియాకు చిరస్మరణీయమైన రోజు.. పాకిస్తాన్ క్రికెట్‌కు మాత్రం ఒక తీవ్ర దుఃఖం.. నిరాశ భరితమైన రోజు.