Leading News Portal in Telugu

2019లోనూ ఇదే ఫలితం: చంద్రబాబు

అమరావతి: ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠ మసకబారుతోందనడానికి ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 2019లోనూ బీజేపీకి ఇదే తరహా ఫలితాలు ఎదురవుతాయని తెలిపారు. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం… ‘‘బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో తొలుత మాట్లాడింది టీడీపీయే. ఇప్పుడు బిహార్‌లో నితీశ్‌ కుమార్‌ కూడా కమలానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు’’ అని తెలిపారు.

ఉప ఎన్నికల ఫలితాల ద్వారా మాటలు చాలు, పని మొదలుపెట్టండనే సంకేతాన్ని ప్రజలు మోదీకి ఇచ్చారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సిట్టింగ్‌ స్థానాలను కూడా కాపాడుకోలేకపోవడం… మోదీకి తగ్గిన ఆదరణకు నిదర్శనమని అన్నారు. ఈ పతనానికి పునాది వేసింది మనమే అని చెప్పారు.

న్యాయశాఖపై ఆగ్రహం…
అగ్రిగోల్డ్‌ ఆస్తుల విషయంలో న్యాయశాఖ అధికారులపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ సమస్యను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నా… ఆమేరకు అధికారులు పనిచేయడం లేదని ఆగ్రహించారు. కొందరు మంత్రుల తీరు మారాలని చంద్రబాబు చురకలేసినట్లు సమాచారం. ‘‘ మంత్రివర్గ సమావేశంలో తిడితే మీ ప్రతిష్ఠ పోతుందనే ఊరుకుంటున్నాను. అంతమాత్రాన మీరు బాగా పనిచేస్తున్నట్లు కాదు. మీలో కొందరి పద్ధతి మారాల్సిందే’’ అని తెలిపారు.