Leading News Portal in Telugu

భారత్‌లో 117కి చేరిన మృతుల సంఖ్య.. కరోనాపై లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవే

భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో మనదేశంలో 354 కొత్త కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో 8 మంది చనిపోయారని వెల్లడించిది. మొత్తంగా దేశంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 4421కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా 117 మంది చనిపోయారు. మరో 326 మంది మంది కోవిడ్-19 మహమ్మారి నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని బట్టి మూడు విధాల సదుపాయాలు కల్పిస్తున్నామని.. కేర్ సెంటర్లు, హెల్త్ సెంటర్లు, హాస్పిటల్స్‌గా కరోనా సేవలను విభజించామని కేంద్రవైద్యఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. కరోనా లక్షణాలున్న వారిని కేర్ సెంటర్లలో, కరోనా నుంచి కోలుకునే స్థాయిలో ఉన్న రోగులను హెల్త్ సెంటర్లలో ఉంచుతున్నామని వెల్లడించారు.

దేశంలో 1,07,006 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ICMR వెల్లడించింది. దేశవ్యాప్తంగా 136 ప్రభుత్వాస్పత్రులు, మరో 59 ప్రైవేట్ ల్యాబ్స్‌లో 24 గంటల పాటు పరీక్షలు చేస్తున్నట్లు తెలిపింది. అటు లాక్‌డౌన్ పొడిగింపుపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ పొడిగింపుపై రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు నిజమేనని.. వాటిని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు లగ్ అగర్వాల్. త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.