Leading News Portal in Telugu

ఒక్కరోజే 32 మంది మృతి.. 5వేలు దాటిన కేసులు.. భారత్‌పై కరోనా ప్రతాపం

భారత్‌లో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. ప్రతి రోజు వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదువుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 773 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్రవైద్యఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాకు తెలిపారు. అంతేకాదు ఒక్క రోజులోనే 32 మంది చనిపోయినట్లు వెల్లడించారు. మొత్తంగా మనదేశంలో ఇప్పటి వరకు 5194 కరోనా కేసులు నమోదయ్యాయని.. వారిలో 402 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారని చెప్పారు. మొత్త మరణాల సంఖ్య 149కి చేరిందని కరోనా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా పలుప్రాంతాలను కరోనా హాట్‌స్పాట్‌లుగా గుర్తించి.. అక్కడ లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నామని కేంద్రం తెలిపింది. నిత్యావసర వస్తువల సరఫరాను సాధారణ స్థాయికి తీసుకొచ్చామని పేర్కొంది. దేశంలో ప్రస్తుతం హైడ్రాక్సిక్లోరోక్విన్ డ్రగ్స్ పుష్కలంగా ఉన్నాయి.. విదేశాలకు ఎగమతి చేసినప్పటికీ మనదేశంలో కొరత ఉండదని లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. కాగా, దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 1018 కేసులు నమోదయ్యాయి. ఇక తమిళనాడులో 690, ఢిల్లీలో 576 మంది కరోనా బారినపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 404 పాజిటివ్ కేసులు నమోదవగా.. ఏపీలో 329 కేసులు నమోదయ్యాయి.