Leading News Portal in Telugu

పాక్‌లో పెరుగుతున్న కరోనా కేసులు… ఒక్క రోజులోనే…

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్… పాకిస్థాన్‌ను కూడా వణికిస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 వేలకు చేరుకోవడంతో… ఏం చేయాలో ఆ దేశ పాలకులకు అర్థం కావడం లేదు. తాజాగా గురువారం ఒక్కరోజే దాయాది దేశంలో 248 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. దీంతో ఆ దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య 4,322కు చేరుకుంది. భారత్ తరహాలోనే పాక్‌లోనూ కొన్ని వారాలుగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అయినా ఆ దేశంలో వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. జాతీయ ఆరోగ్య సేవ‌ల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం…క‌రోనా కార‌ణంగా దేశంలో 60 మంది మ‌ర‌ణించగా, 572 మంది కోలుకున్నారు.

ఇప్పటివరకు న‌మోదైన కేసుల్లో అత్యధిక శాతం ఆ దేశంలోని పంజాబ్‌ ప్రావిన్స్‌లోనే నమోదయ్యాయి. మరోవైపు క‌రోనా బాధితుల‌కు చికిత్స అందించ‌డానికి స‌రిప‌డా ఆసుప‌త్రులు కూడా లేవ‌ని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆందోళ‌న వ్యక్తం చేశారు. ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండి… ప్రభుత్వ ఆదేశాల‌ను పాటించాలని ఆయన సూచించారు. అయితే సంపూర్ణ లాక్‌డౌన్ విధించ‌కూడ‌ద‌నే త‌న నిర్ణయాన్ని మాత్రం ఇమ్రాన్ ఖాన్ మాత్రం స‌మ‌ర్థించుకున్నారు. దేశంలో 50 మిలియన్లకు పైగా ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని… సంపూర్ణ లాక్‌డౌన్ అమ‌లుచేస్తే వారంతా ఆక‌లితో చ‌నిపోతార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు.