కరోనాతో అమెరికాలో 11 మంది భారతీయులు మృతి
కరోనా కారణంగా విలవిల్లాడుతోన్న అమెరికాలో పరిస్థితి దయనీయంగా మారింది. ఈ మహమ్మారి కారణంగా అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 11మంది భారతీయులు కరోనాతో చనిపోయినట్లు తెలుస్తోంది. వీరిలో 10 మంది న్యూయార్క్, న్యూజెర్సీ నగరాలకి చెందిన వారు కాగా, ఒక్కరు ఫ్లోరిడాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇక మృతుల్లో నలుగురు ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నట్లు సమాచారం. మరికొందరు భారతీయులు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. నిర్భంధంలో ఉన్నవారిలో నలుగురు మహిళలు ఉన్నారు. వీరంతా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ట్రాలు చెందినవారని అధికారులు తెలిపారు.
కరోనావైరస్ బారిన పడిన భారతీయులకు అవసరమైన సహాయం అందించడానికి భారత రాయబార కార్యాలయం,కాన్సులేట్లు స్థానిక అధికారులు ఎన్నారై సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి. కఠిన నిబంధనలు అమలులో ఉండడం వల్ల మరణించిన భారతీయుల అంత్యక్రియలను అక్కడి అధికారులే చేపడుతున్నారు. కుటుంబ సభ్యులను కూడా అనుమతించడం లేదని అధికారులు చెబుతున్నారు. కాగా… కరోనా బారిన పడి ఇప్పటికే 14 వేలమందికి పైగా మృతి చెందారు. బుధవారం ఒక్కరోజే దాదాపు 2 వేల మంది మృత్యువాత పడ్డారు.