సమాజానికి తిరిగిద్దాం… రూ.21కోట్ల కరోనా ఫండ్ నెలకొల్పిన డాబర్ గ్రూప్
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నెలకొన్న వేళ ఆపన్నులను ఆదుకొనేందుకు రోజు రోజుకు మనసున్న మారాజులు ముందుకొస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా డాబర్ గ్రూప్ కూడా ముందుకొచ్చింది. కరోనా వైరస్ సహాయక చర్యల కోసం రూ.21 కోట్లు కేటాయించింది. డాబర్ గ్రూప్ తాజాగా ‘డాబర్ కేర్ ఫండ్ ఫర్ కోవిడ్ 19’ను ఏర్పాటు చేసింది. రూ.21 కోట్లలో రూ.11 కోట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్కు ఇస్తుంది. మిగిలిన నిధులను కరోనా వల్ల అత్యధికంగా, ప్రధమంగా బాధపడే వర్గాలకు అందించనుంది. ‘ఓ సంస్థగా… ప్రజలకు వెనక్కి తిరిగి ఇవ్వడంలో ఉన్న ప్రాధాన్యం తెలుసు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు, కస్టమర్ల ఆరోగ్యం కూడా మాకు ముఖ్యం. ఆ దిశగా డాబర్ గ్రూప్ కృషి చేస్తుంది.’ అని డాబర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అమిత్ బర్మానీ చెప్పారు. ఈ మూడు విభాగాల్లో డాబర్ గ్రూప్ సేవలు అందిస్తుంది. పీఎం కేర్స్ ఫండ్కు రూ.11 కోట్లు అందజేస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ముందుండి పోరాడుతున్న వ్యక్తులు (డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది)కు సాయం చేస్తుంది. కరోనా వల్ల అత్యంత ఎక్కువగా నష్టపోతున్న వలస కార్మికులను ఆదుకునేందుకు డాబర్ గ్రూప్ పనిచేస్తుంది.
తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రా కూడా ఓ వినూత్న ఐడియాతో ముందుకొచ్చారు. ముఖ్యంగా రైతులను ఆదుకునేందుకు ఆయన చొరవ చూపారు. తాజాగా కష్టాల్లో ఉన్న అరటి రైతులను ఆదుకునేందుకు కొత్త ఐడియాతో ముందుకొచ్చారు. తమ క్యాంటిన్లలో ప్లేట్ల స్థానంలో అరటి ఆకులను వినియోగిస్తున్నారు. అకాల వర్షాలు, వ్యాపారం లేక నష్టపోయిన అరటి రైతుల నుంచి అరటి ఆకులను కొని.. వాటిని తమ క్యాంటిన్లలో ప్లేట్ల స్థానంలో ఉపయోగిస్తున్నారు. ఓ రిటైర్డ్ జర్నలిస్ట్ పద్మ రామనాథ్ ఈ ఐడియా ఇచ్చారని.. ఇది అద్భుతంగా ఉందని ఆనంద్ మహింద్ర కొనియాడారు. తాము చేస్తున్న ఈ ప్రయత్నంలో కొద్ది మంది రైతులకన్నా లాభం జరుగుతుందని ట్వీట్ చేశారు.