తెలంగాణలో 20 మంది చిన్నారులకు కరోనా.. గాంధీలో ప్రత్యేక చికిత్స
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే 600 మందికి పైగా కరోనా బారినపడ్డారు. ఐతే రాష్ట్రంలోని కరోనా బాధితుల్లో 20 మంది చిన్నారులు ఉన్నారు. వారిలో 23 రోజుల పసికందు నుంచి 12 ఏళ్ల చిన్నారుల వరకు ఉన్నారు. ప్రస్తుతం వారందరికీ గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నారు. చిన్నపిల్లలకు ప్రత్యేకంగా చికిత్స చేయాలన్న నిబంధనల నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలోని 6వ అంతస్తులో ఐసోలేషన్ వార్డు ఏర్పాటుచేసి చికిత్స అందిస్తున్నారు. ఐతే చిన్నారులకు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వల్ల వైరస్ సంక్రమించిందని డాక్టర్లు చెబుతున్నారు. బాధితుల్లో ఒక బాలుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని.. ఐనప్పటికీ ఎలాంటి ప్రమాదం లేదని గాంధీ వైద్యులు తెలిపారు.
చిన్నపిల్లలు, వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంట్లో పిల్లలకు బలవర్ధక ఆహారం పెట్టాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చిన్నపిల్లలను ఇంటి నుంచి అస్సలు బయటకు పంపవద్దు. మాస్క్ పెట్టడం మరచిపోవద్దు. శుభ్రత విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్నప్పటికీ తరచూ చేతులు శుభ్రం చేస్తూ ఉండాలి. హ్యాండ్ శానిటైజర్ వాడడం మంచింది. ముక్కు, నోరు, చెవిలో చేతి వేళ్లు పెట్టుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.
తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 644కు చేరింది. ఈ వైరస్ బారిన పడి చనిపోయిన 18 మంది చనిపోయారు. మరో 110 మంది కోవిడ్ 19 నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 516గా ఉంది. హైదరాబాద్లో 300 మందికిపైగా కరోనా బారినపడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో యాక్టివ్ కేసుల సంఖ్య 249గా ఉంది. 58 మంది డిశ్చార్జ్ అయ్యారు. మే 3 వరకు లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో అందరూ ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాగైతే పాటించారో.. ఇకపైనా అలాంగే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏప్రిల్ 20 వరకు చాలా కఠినంగా లాక్డౌన్ అమల్లో ఉంటుందని.. ఆ తర్వాత పలు రంగాలకు మినహాయింపు ఉంటుందని చెప్పారు.