Leading News Portal in Telugu

32 వేల మందికి పరీక్షలు… క్వారంటైన్‌పై జగన్ కీలక ఆదేశాలు

కుటుంబ సర్వేద్వారా గుర్తించిన సుమారు 32వేల మందికి కూడా పరీక్షలు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఆ తరువాత ర్యాండమ్‌గా పరీక్షలు చేయాలని స్పష్టం చేశారు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ర్యాండమ్‌ పరీక్షలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో కోవిడ్‌ విస్తరణ, పరీక్షలు, పాజిటివ్‌గా నమోదైన కేసుల వివరాలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. మరో నాలుగైదు రోజుల్లో కోవిడ్‌ –19 పరీక్షల రోజువారీ సామర్థ్యం 2వేల నుంచి 4వేలకు పెంచుతామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం రోజుకు 2100కుపైగా పరీక్షలు చేస్తున్నామని… ట్రూనాట్‌ పరికరాలను వినియోగించుకుని పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతామని తెలిపారు. క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలపై సీఎం జగన్ ఆరా తీశారు.

ప్రతిరోజూ ప్రతి మనిషికి భోజనం, బెడ్‌కోసం, దుప్పటికోసం రూ. 500 ఇవ్వాలని అన్నారు. ప్రతిరోజూ ప్రతిమనిషికి రూ. 50 పారిశుద్ధ్యం, ఇతరత్రా ఖర్చులకోసం రోజుకు రూ.50 ప్రయాణ ఖర్చుల కింద క్వారంటైన్‌ సెంటర్‌కు రూ.300, తిరుగు ప్రయాణంకోసం కూడా మరో రూ.300 ఖర్చు చేస్తున్నట్టుగా అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. డబుల్‌ రూమ్ లేదా, సింగిల్‌ రూమ్ ఇస్తున్నామని తెలిపారు.

క్వారంటైన్‌ సెంటర్లలో మెడికల్‌ ప్రోటోకాల్‌ పూర్తిచేసుకుని తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు పేదలకు కనీసం రూ.2వేలు ఆర్థిక సహాయం చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. వాళ్లు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పాటించాల్సిన జాగ్రత్తలను సూచించాలని అన్నారు. క్వారంటైన్‌ సెంటర్లలో ఏమేమి ఉండాలన్నదానిపై ఎస్‌ఓపీని దిగువ అధికారులకు పంపించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఫ్రంట్‌ లైన్లో ఉన్నవారికి, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న వారి ఆరోగ్య పరిరక్షణలో జాగ్రత్త వహించాలని తెలిపారు.