కరోనాతో చనిపోయిన డాక్టర్… అధికారుల్లో టెన్షన్
కర్నూలు నగరంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మూడు రోజుల క్రితం నగరంలో ఓ ప్రముఖ వైద్యుడు కరోనాతో చనిపోవడంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ఆ ఆస్పత్రిలో పని చేస్తున్న వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు… వారిని ఐసొలేషన్కు తరలించారు. మరోవైపు డాక్టర్ దగ్గరకు వచ్చిన పేషెంట్లు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గత నెల 20 తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఆ డాక్టర్ దగ్గరకు వచ్చిన పేషెంట్ల జాబితాను అధికారులను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజ్ను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. సాధ్యమైనంతవరకు డాక్టర్ను కలిసి పేషెంట్లను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే నగరంలో 50 కేసులు నమోదయ్యాయి. కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కర్నూలు నగరంలో 80 శాతానికి పైగా ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించిన అధికారులు… మెడికల్ షాపులు సహా అన్నింటిని మూసేసి లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులతో పాటు మందులను కూడా డోర్ డెలివరీ చేస్తున్నారు. కర్నూలుతో పాటు నంద్యాల డివిజన్లోనూ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. నంద్యాలలో ఇప్పటివరకు 27 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అత్యధికం శాతం ఢిల్లీలోని మర్కజ్తో లింకులు ఉన్నవే అని అధికారులు చెబుతూ వచ్చారు. తాజాగా కరోనాతో డాక్టర్ చనిపోవడంతో… ఆయన ద్వారా వైరస్ ఎంతమందికి సోకిందనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.