మూడు నెలలుగా వేతనాల్లేవ్… ఏపీలో మీసేవ ఉద్యోగుల వెతలు…
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ మీ సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న తమకు మూడు నెలలుగా వేతనాలు రావడం లేదంటూ సంబంధిత ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో గవర్నమెంట్ పరిధిలోని అర్బన్ ‘ఇ’ (మీ) సేవ కేంద్రాలలో దాదాపు 700 మంది ఉద్యోగులు ‘ఇ’ సేవ వ్యవస్థ ప్రారంభం 2003 నుంచి నేటి వరకు (మేనేజర్లు, ఆపరేటర్లు, కోఆర్డినేటర్, నెట్వర్క్ ఇంజినీర్, సెక్యూరిటీ గార్డులు గా) విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సర్వీస్ ప్రొవైడర్ రామ్ ఇన్ఫో యాజమాన్యం గత మూడు నెలలుగా (జనవరి, ఫిబ్రవరి, మార్చి ) ఉద్యోగులకు వేతనాలు చెల్లించడంలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
దీని వలన ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్ కొనసాగిస్తున్న ఈ సమయంలో వేతనాలు రాకపోవడంతో మా కుటుంబాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పై యాజమాన్యానికి, ESD అధికారుల దృష్టికి పలుమార్లు లిఖితపూర్వకంగా తీసుకువెళ్లినా ఎటువంటి స్పందన లేదని చెబుతున్నారు.