కంటైన్మెంట్ జోన్లపై 12 సూచనలు చేసిన కేటీఆర్
కంటైన్మెంట్ జోన్లలో వున్న ప్రజలను ఇళ్లకే పరిమితం చేయాలని మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, మెడిసిన్స్ను ఇళ్ల వద్దకే సరఫరా చేయాలని సూచించారు. ప్రభుత్వం నియమించిన వాలెంటీర్లు, సిబ్బందిచే మాత్రమే నిత్యవసరాలను డోర్ డెలవరీ చేయించాలని ఆదేశించారు. వీలైతే వాలెంటీర్లు, సిబ్బందికి ప్రత్యేక దుస్తులు అందజేయాలని తెలిపారు. మంత్రులు ఈటెల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి జిహెచ్ఎంసి కార్యాలయం నుండి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంటైన్మెంట్ జోన్లలోకి దాతలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు.
కంటైన్మెంట్ జోన్లోని కుటుంబాల సెల్ నెంబర్లతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి, అవసరాలను తెలుసుకోవాలన్నారు. కంటైన్మెంట్ నిబంధనలు అతిక్రమించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం కంటైన్మెంట్ జోన్లను తొలగించనున్నట్లు తెలిపారు. ప్రజల సహకారం పైనే కంటైన్మెంట్ జోన్ల తొలగింపు ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆ విధంగా జిహెచ్ఎంసి పరిధిలో 15 కంటైన్మెంట్ జోన్లను తొలగించినట్లు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. కొత్త కేసులు నమోదు కాకుండా కంటైన్మెంట్ నిబంధనలపై అవగాహన కల్పించి, ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు.
కంటైన్మెంట్ జోన్లను మానిటరింగ్ చేసేందుకు చేపట్టాల్సిన 12 ప్రధాన అంశాల గురించి అధికారులకు మంత్రి కేటీఆర్ వివరించారు. సరైన విధంగా బారీకేడింగ్ చేయడం, సంబంధిత శాఖల సిబ్బందిని నియమించడం, ఫీవర్ సర్వే కోసం పారమెడికల్ సిబ్బందిని నియమించడం, శానిటేషన్, స్ప్రేయింగ్ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడం, నిత్యవసర వస్తువులను ఇంటింటికి అందించుటకై ఏర్పాట్లు చేయడం, పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా కంటైన్మెంట్ నిబంధనలు పాటించాలని కోరుతూ, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి ప్రచారం చేయడం వంటిని చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు.