దొంగతనానికి వచ్చిన వ్యక్తి.. ఇంట్లో ఒంటరిగా ఉన్న అంధురాలిపై అఘాయిత్యం..
దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి ఇంట్లో ఒంటరిగా ఉన్న అంధురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన భోపాల్లో జరిగింది. ఓవైపు దేశం మొత్తం కరోనా వైరస్ నియంత్రణకు పోరాడుతుంటే.. ఓ వ్యక్తి మాత్రం తన కామవాంఛ తీర్చుకున్నాడు. అది ఓ అంధురాలిపై.. పూర్తి వివరాల్లోకి వెళితే.. భోపాల్లోని ఓ మహిళ బ్యాంకు ఉద్యోగినిగా పనిచేస్తోంది. లాక్డౌన్ నిబంధనల వల్ల కొద్ది రోజులుగా ఇంటికి పరిమితమయ్యింది. సదరు మహిళ భర్త ఇటీవలే గుజరాత్లోని బంధువుల ఇంటికెళ్లాడు. అతడు సైతం అంధుడే కావడంతో లాక్డౌన్ కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఒంటరిగా ఉంటున్న సదరు మహిళ ఇంటిలోకి ఓ దుండగుడు శుక్రవారం తెల్లవారుజామున చొరబడ్డాడు.
అనంతరం ఆమెపై లైంగికదాడి చేశాడు. అంధురాలైన మహిళ కేకలు వేయడంతో బయటి నుంచి తలుపులు పెట్టి ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసుకుని పారిపోయాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఇంట్లో దొంగతనానికి వచ్చిన వ్యక్తే ఆ మహిళ ఒంటిరిగా ఉండడం చూసి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం గుజరాత్లో ఉన్న భర్తకు తెలిపారు. అతడిని భోపాల్కు రప్పించేందుకు వాహనాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.