Leading News Portal in Telugu

మీ కార్మికులు కావలెను.. ఆ 4 రాష్ట్రాలకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుంది. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, అత్యవసర సేవలు మినహా ఎవరికీ మినహాయింపు లేదు. ఐతే తెలంగాణలో పంటలు పెద్ద మొత్తంలో కోతకు వచ్చాయి. వ్యవసాయ రంగానికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉన్నప్పటికీ వరి పొలాల్లో పనులు జరగడం లేదు. దీనికి ఒక్కటే కారణం కూలీల కొరత..! తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో బీహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన కార్మికులు చాలా మంది పనిచేసేవారు. ఐతే హోలీ పండగ కోసం వారంతా సొంతూర్లకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్ ప్రకటించడంతో అక్కడే ఉండిపోయారు. ఈ సీజన్‌లో తెలంగాణలో పంట కోతలు కోతలు ఎక్కువ ఉంటాయి. ఐతే హార్వెస్టర్లు, రైస్ మిల్స్‌లో పనిచేసే కార్మికులు లేకపోవడంతో పనులు ఆగిపోతున్నాయి.

ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బీహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గడ్, ఒడిశా రాష్ట్రాల సీఎస్‌లకు లేఖరాశారు. తెలంగాణలో పనిచేసే 20 వేల మంది కార్మికులు అక్కడే ఉండిపోయారని.. కూలీల కొరత కారణంగా రాష్ట్రంలో వరి కోతల సమయంలో 2600ల రైస్ మిల్లులు ఆగిపోయాయని పేర్కొన్నారు. కోతల నుంచి మొదలుకొని.. రైస్ మిల్లుల్లో పనుల వరకూ అన్నీ నిలిచిపోయానని తెలిపారు. ఈ నేపథ్యంతో తిరిగి తెలంగాణకు రావాలనుకుంటున్న కూలీలను.. అనుతించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది తెలంగాణ. వారి కోసం ప్రత్యేక బస్సులను పంపిస్తామని తెలిపింది. కూలీల ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని.. బస్సుల్లో సామాజిక దూరంగా పాటించేలా చర్యలు చేపడతామని చెప్పారు. బస్సులు ఎక్కే ముందు ప్రతి కార్మికుడి ఆరోగ్యాన్ని చెక్ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ విజ్ఞప్తిపై ఆయా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.