Leading News Portal in Telugu

నిందితులకు కరోనా… క్వారంటైన్‌కు పోలీసులు… పోలీస్ స్టేషన్ సీల్

కరోనా బాధితుడిని ఆస్పత్రికి తరలించాలని ప్రయత్నించిన మెడికల్ సిబ్బందిపై కొందరు రాళ్ల దాడి చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దాదాపు 20 మందిని అదుపులోకి తీసుకుని క్వారంటైన్‌కు తరలించారు. ఇది జరిగి ఆరు రోజులైంది. కానీ ఆ రోజుల్లోనే సీన్ మారిపోయింది. పోలీసులు అదుపులోకి తీసుకుని 20 మందిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. అంతేనా… ఆ పోలీసులు విధులు నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్‌కు సీల్ వేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో మొరాదాబాద్‌లో చోటు చేసుకుంది. దీంతో నగ్ఫానీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులందరినీ క్వారంటైన్‌కు తరలించారు. ఆ పోలీస్ స్టేషన్‌కు సీల్ వేశారు.

ఈ ఘటనకు సంబంధించిన 58 మంది అనుమానితుల రిపోర్టులు రాగా… వారిలో 15 మంది పాజిటివ్ వచ్చింది. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే వేరే వార్డుకు తరలించారు. ఈ ఘటనపై సీరియస్ అయిన సీఎం యోగి ఆదిత్యనాథ్… నిందితులను గుర్తించి వారిపై జాతీయ భద్రతా చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని ఆదేశించారు. మొరాదాబాద్‌లో ఇప్పటివరకు ఐదుగురు కరోనా కారణం చనిపోయారు. 58 మందికి పాజిటివ్ వచ్చింది. ఒకరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.