Corona Updates: భారత్లో 600 దాటిన కరోనా మరణాలు
దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజూ వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,329 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. అంతేకాదు మరో 44 మంది మరణించారని వెల్లడించింది. తాజా లెక్కలతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,985కి చేరింది. వీరిలో కరోనాతో పోరాడుతూ 3,260 మంది కోలుకోగా… 603 మంది మరణించారు. ప్రస్తుత మన దేశంలో 18,985 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ప్రస్తుతం మనదేశంలో కరోనా నుంచి కోలుకునే రేటు 17.48గా ఉందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల కోసం వినియోగిస్తున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ వినియోగాన్ని రెండు రోజుల పాటు ఆపేయాలని ఐసీఎంఆర్ సూచించింది. ఈ కిట్స్పై కొన్ని సందేహాలు ఉన్న నేపథ్యంలో దీనిపై రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులతో పాటు ఇతర వైద్య సర్వీసులపై కూడా దృష్టి పెట్టాలని రాష్ట్రాలను ఆదేశించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. డయాలసిస్, హెచ్ఐవీ, క్యాన్సర్ బాధితులకు సైతం చికిత్స అందించాలని స్పష్టం చేసింది.