దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు… ఆ టెస్టింగ్ కిట్స్ వాడొద్దన్న ఐసీఎంఆర్
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 18,601కి చేరిందని కేంద్రం ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 1331 కొత్త కేసులు నమోదైనట్టు వెల్లడించింది. కరోనా నుంచి ఇప్పటివరకు 3,252 మంది కోలుకున్నారని తెలిపింది. నిన్న ఒక్క రోజే 705 మంది కరోనా నుంచి కోలుకున్నారని వివరించింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి శాతం 17.48కు చేరుకుందని ప్రకటించింది. కరోనా కారణంగా ఇప్పటివరకు దాదాపు 600 మంది చనిపోయారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4,49,810 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది. నిన్న ఒక్క రోజే 35, 852 మందికి కరోనా టెస్టులు చేసినట్టు వివరించింది.
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల కోసం వినియోగిస్తున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ వినియోగాన్ని రెండు రోజుల పాటు ఆపేయాలని ఐసీఎంఆర్ సూచించింది. ఈ కిట్స్పై కొన్ని సందేహాలు ఉన్న నేపథ్యంలో దీనిపై రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులతో పాటు ఇతర వైద్య సర్వీసులపై కూడా దృష్టి పెట్టాలని రాష్ట్రాలను ఆదేశించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. డయాలసిస్, హెచ్ఐవీ, క్యాన్సర్ బాధితులకు సైతం చికిత్స అందించాలని స్పష్టం చేసింది.