కరోనా ఎఫెక్ట్… ఆ జిల్లాకు ప్రత్యేక అధికారి… సీఎం కేసీఆర్ నిర్ణయం
తెలంగాణలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం… పలు జిల్లాల్లో ఈ వైరస్ విస్తరిస్తుండటంపై ఆందోళన చెందుతోంది. తెలంగాణలో హైదరాబాద్ తరువాత కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాల జాబితాలో సూర్యాపేట కూడా చేరింది. ఈ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 54కు చేరడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. దీంతో సూర్యాపేట జిల్లాపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో కరోనా వ్యాప్తిని నిలవరిచేందుకు ప్రత్యేక అధికారిగా వేణుగోపాల్ రెడ్డిని నియమిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈయన ప్రస్తుతం తెలంగాణ పురపాలక డిప్యూటీ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.
సూర్యాపేటలో ఇప్పటివరకు 54 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 564 మంది శాంపిల్స్ను సేకరించగా… 62 మందికి సంబంధించి ఫలితాలు వెలువడాల్సి ఉంది. జిల్లాలోని ప్రభుత్వ క్వారంటైన్లో 182 మంది ఉండగా… హోం క్వారంటైన్లో 683 మంది ఉన్నారు.