Leading News Portal in Telugu

Andhra Pradesh: అంగళ్లు అల్లర్ల కేసులో ఏ1గా చంద్రబాబు.. చంపేందుకు కుట్ర చేశారంటూ బాబు సంచలన ఆరోపణలు.. – Telugu News | Mudivedu Police Case Filed on TDP President Chandrababu over Angallu Clashes


అంగళ్లులో దాడిపై ఉమాపతి ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ గంగాధర్ వెల్లడించారు. ముదివీడు పీఎస్‌లో చంద్రబాబు సహా 14 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను ఎస్పీ తాజాగా వెల్లడించారు. కుట్రపూరితంగానే అంగళ్లులో ఘర్షణలు సృష్టించారని అన్నమయ్యజిల్లా ఎస్పీ గంగాధర్‌ ప్రకటించారు. ‘కొట్టండి, తరిమేయండని మాజీ సీఎం చంద్రబాబు ప్రోత్సహించారు’ అని పేర్కొన్నారు. ఈ కేసులో ఏ1-చంద్రబాబు, ఏ2-దేవినేని ఉమా..

TDP President Chandrababu

అన్నమయ్య జిల్లా, ఆగష్టు 09: అన్నమయ్య జిల్లా అంగళ్లులో చోటు చేసుకున్న ఘర్షణలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అంగళ్లులో దాడిపై ఉమాపతి ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ గంగాధర్ వెల్లడించారు. ముదివీడు పీఎస్‌లో చంద్రబాబు సహా 14 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను ఎస్పీ తాజాగా వెల్లడించారు. కుట్రపూరితంగానే అంగళ్లులో ఘర్షణలు సృష్టించారని అన్నమయ్యజిల్లా ఎస్పీ గంగాధర్‌ ప్రకటించారు. ‘కొట్టండి, తరిమేయండని మాజీ సీఎం చంద్రబాబు ప్రోత్సహించారు’ అని పేర్కొన్నారు. ఈ కేసులో ఏ1-చంద్రబాబు, ఏ2-దేవినేని ఉమా, ఏ3-అమర్నాథ్‌ రెడ్డి పేర్లను చేర్చినట్లు వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిపై దర్యాప్తు జరుగుతోందని, ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు ఎస్పీ గంగాధర్.

చంపేందుకు కుట్ర చేస్తున్నారు..

తనపై కేసు పెట్టడంపై చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. అంగళ్లులో తనను చంపాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు. తనపై హత్యాయత్నానికి పోలీసులు కూడా సహకరించారని ఆరోపించారు చంద్రబాబు. తనతో పాటు తన క్యాడర్‌పైనా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను చంపి రాజకీయాలు చేస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. అంగళ్లు అల్లర్లపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.

కేసులకు భయపడేది లేదు..

ఏపీ సర్కార్ పెట్టే కేసులకు భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. కేసులకు భయపడి పారిపోనని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినా భయపడే సవాలే లేదన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయలేని, చేతగాని ప్రభుత్వం ఇదంటూ వైసీపీ సర్కార్ చర్యలపై నిప్పులు చెరిగారు దేవినేని ఉమ. కేసులు కాదు.. ముందు పోలవరాన్ని పూర్తి చేయండని సవాల్ విసిరారు. కాగా, అంగళ్లు ఘర్షణల కేసులో దేవినేని ఉమను ఏ2గా చేర్చిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

బాబు కేసు అసంబద్ధం..

చంద్రబాబు నాయుడిపై పెట్టిన కేసు అసంబద్ధం అని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్‌ గజపతిరాజు అన్నారు. నాలుగేళ్ల పాలనలో ప్రకటనలు తప్ప అభివృద్ధి లేదని వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ప్రతిపక్ష నాయకుడిని ఫినిష్‌ చేయాలన్న వారిపై కేసు నమోదు చేయాలి డిమాండ్ చేశారు అశోక్‌ గజపతిరాజు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో రెచ్చగొట్టారంటూ చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..