Leading News Portal in Telugu

Pawan Kalyan: మళ్లీ విశాఖకు పవన్‌కు.. నేడు ఎర్రమట్టి కొండల పరిశీలన


Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తలపెట్టిన వారాహి విజయ యాత్ర విశాఖలో కొనసాగుతోంది.. ఇప్పటికే రుషికొండ, విసన్నపేటలోని వివాదాస్పద భూములను పరిశీలించిన జనసేనాని.. అక్రమాలు జరుగుతున్నాయంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. అక్కడ జరుగుతోన్న పర్యావరణ ఉల్లంఘనలపై కేంద్ర గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు కూడా ప్రకటించారు. ఇక, ఈ రోజు మధ్యాహ్నం విశాఖపట్నానికి చేరుకోనున్నారు పవన్‌.. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయం నుంచి విశాఖ వెళ్లనున్న ఆయన.. 6వ రోజు వారాహి విజయ యాత్రలో భాగంగా భీమిలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు.. జియో హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందిన ఎర్రమట్టి కొండలను పరిశీలించనున్నారు.. ప్రకృతి సంపదను రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తోంది జనసేన పార్టీ..

ఓవైపు ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చర్చిస్తూనే మరోవైపు వారాహి విజయయాత్రలో అధికార పార్టీపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతూ వస్తున్నారు.. వాలంటీర్‌ వ్యవస్థపై పవన్‌ విమర్శల దండ యాత్ర కొనసాగుతూనే ఉంది.. మొత్తంగా ఈ నెల 19వ తేదీ వరకు పవన్ కల్యాణ్‌ వారాహి మూడో విడత యాత్ర ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో కొనసాగనుంది.. విశాఖ జిల్లాలోని ప్రజల సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు పవన్‌ కల్యాణ్‌.. కాగా, వారాహి తొలి, మలి విడత యాత్రలు ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించిన జనసేనాని.. మూడో విడతకు విశాఖపట్టణాన్ని ఎంచుకున్న విషయం విదితమే.