తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి నూతన కార్యవర్గ సభ్యులను ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే.. దీనిపై ప్రతిపక్షాల నేతలు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ట్వి్ట్టర్ వేదిక టీటీడీ పాలక మండలి నియామకంపై ట్విట్టస్త్రాలు సంధించారు. టీటీడీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రమని మరోసారి ఏపీ సీఎం స్పష్టం చేశారని ఆమె ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. శరత్ చంద్రా రెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణంలో పాత్రధారుడిగా ఉన్నారని, కేతన్ దేశాయ్ ఎంసీఐ స్కాంలో దోషిగా నిరూపించబడి ఢిల్లీ హైకోర్టు చేత తొలగించబడ్డారని ఆమె మండిపడ్డారు. తిరుమల తిరుపతి పవిత్రతను మసకబరిచేలా ఉన్న నియామకాలను భారతీయ జనతా పార్టీ ఖండిస్తుందని ఆమె వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. టీటీడీ పాలక మండలిలో సభ్యులుగా చోటు కల్పించాలని పలు రాష్ట్రాలు, రంగాల నుంచి అనేక అభ్యర్థనలు వచ్చాయి. దీనిపై పనిచేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని కమిటీ 24 మందికి బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించింది. ఏపీకి చెందిన బీసీలు నలుగురు, ఎస్సీ, ఎస్టీ ఒకరు ఉండటం గమనార్హం. ఈ నెల 5వ తేదీన టీటీడీ కొత్త చైర్మన్గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. 10వ తేదీన ఆయన బాధ్యతలు స్వీకరించారు. 24 మందిలో 18 మంది కొత్త సభ్యులను నియమించగా, ఆరుగురు పాత సభ్యులను పాలక మండలిలో కొనసాగించారు. తెలంగాణ నుంచి చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి భార్య గడ్డా సీతారెడ్డితోపాటు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల రాంరెడ్డికి చోటు దక్కింది. తమిళనాడు నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి నలుగురికి పాలక మండలిలో చోటు కల్పించారు.