Leading News Portal in Telugu

AP High Court: హైకోర్టుకు చేరిన టీటీడీ కొత్త పాలక మండలి వ్యవహారం..


AP High Court: టీటీడీ పాలకమండలి వ్యవహారం హైకోర్టుకు చే రింది.. టీటీడీ బోర్డ్ మెంబర్స్ నియామకాలు సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.. చింతా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆ పిల్‌ను వేశారు.. నేరచరిత్ర, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్న వారిని టీటీడీ బోర్డులో నియమించడం మంచి పద్ధతి కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు.. బోర్డ్ మెంబర్లుగా క్రిమినల్ కేసులు ఉన్న ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మెంబర్‌గా అత్యంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొని న్యాయాస్థానాల ద్వారా తొలగించబడిన కేతన్ దేశాయ్, లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొన్న శరత్ చంద్రారెడ్డి నియామకాలు సవాల్ చేస్తూ ఆ పిల్‌ దాఖలు చేశారు.

ఇక, వెంటనే ఈ ముగ్గురిని టీటీడీ బోర్డ్ మెంబర్లుగా తొలగించాలని పిల్‌లో పేర్కొన్నారు పిటిషనర్‌.. టీటీడీ కోట్ల మంది భక్తుల మనోభావాలకు ముడిపడి ఉందన్న పిటిషనర్‌.. ఇటువంటి నేరచరిత్ర, నీతిబాహ్యమైన కేసులు ఉన్నవారిని నియమించడం భావ్యం కాదన్నారు.. టీటీడీ ట్రస్టీలుగా నియమించబడినవారు దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు.. అయితే, ఈ పిల్‌పై బుధవారం విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.. పిటిషనర్ తరుపున న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించనున్నారు. ఈ మధ్యే తిరుమల తిరుపది దేవస్థానం (టీటీడీ) పాలకమండలిని నియమించగా.. ఇప్పుడు ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో ఆసక్తికరంగా మారింది.