సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు, అనురాగానికి చిహ్నం రాఖీ వేడుక. అయితే.. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడిని. మీ సంక్షేమమే లక్ష్యంగా.. మీ రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తూ మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నాను!’ అని ఆయన పోస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే.. నేడు సీఎం జగన్ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ జిల్లాలోని జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి జగ్గంపేట మండలం ఇర్రిపాక చేరుకుంటారు. అక్కడ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నివాసంలో ఆయన కుమార్తె వివాహ వేడుకకు హాజరవుతారు.అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
అయితే.. సీఎం జగన్ సెప్టెంబర్ 2వ తేదీన కడపలో పర్యటించనున్నారు. జిల్లా కలెక్టర్ వి.విజయ రామరాజు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో ఒకరోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సీఎం కార్యక్రమాల నేపథ్యంలో మంగళవారం ఇక్కడ అధికారులతో సమావేశమయ్యారు. ఒకటి, రెండు రోజుల్లో సీఎం జిల్లా పర్యటన ఖచ్చితమైన షెడ్యూల్ని అంచనా వేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సీఎం కార్యక్రమం విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాల వేదిక వద్ద ప్రొటోకాల్ విధివిధానాలు కచ్చితంగా పాటించాలని అన్నారు.