Leading News Portal in Telugu

Udayanidhi Stalin: ఉదయనిధిని చెప్పుతో కొడితే రూ.10 లక్షల రివార్డ్.. ఏపీలో పోస్టర్లు..


Udayanidhi Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఆ రాష్ట్ర మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ ఉదయనిధి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది. డీఎంకే పార్టీ ఇండియా కూటమిలో ఉండటంతో, ఆ కూటమికి హిందూమతంపై ద్వేషం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఇదిలా ఉంటే ఉదయనిధి స్టాలిన్ తల నరికితే రూ. 10 కోట్లు ఇస్తానని ఆయోధ్యకు చెందిన సాధువు ప్రకటన ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ కి చెందిన జనజాగరణ సమితి అనే స్వచ్ఛంద సంస్థ ఉదయనిధిని చెప్పుతో కొడితే రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్లను కూడా అంటించింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించిందుకు ఈ ప్రకటన చేసింది. ఏపీలోని విజయవాడలో ఆ సంస్థ పోస్టర్లు కనిపించాయి.

అంతకుముందు చెన్నైలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మ సమాజిక న్యాయభావనకు విరుద్ధమని దానిని నిర్మూలించాలని వివాదాస్పద ఉదయనిధి స్టాలిన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పోల్చారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. హిందువులందరిని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి.

తాజాగా ఇతని వ్యాఖ్యలపై ప్రధాని మోడీ కూడా స్పందించారు. సతనాత వ్యాఖ్యలకు తగిన విధంగా సమాధానం ఇవ్వాలని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఇండియా కూటమి స్పందించడం లేదని.. ఇండియా కూటమికి హిందువులంటే ద్వేషం అని, ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసం ఇలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.