AP Education: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్కరణలు భేషుగ్గా ఉన్నాయని నోబెల్ అవార్డు గ్రహీత ఫ్రొఫెసర్ మైకేల్ క్రేమెర్ ప్రశంసలు గుప్పించారు. గురువారం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయానికి మైకేల్ క్రేమెర్తో పాటు పాటు చికాగోలోని డీఐఎల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎమిలీ క్యుపిటో బృందం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున విద్యాభివృద్ధికి చేపడుతున్న పథకాలు, కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం నోబెల్ అవార్డు గ్రహీత మైకేల్ క్రేమెర్, చికాగో యూనివర్శిటీ బృందాన్ని సత్కరించారు.
సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ‘పర్సనలైజ్డ్ అండ్ అడాప్టివ్ లెర్నింగ్’ (Personalized and adaptive learning-PAL) ప్రాజెక్టు అమలు చేస్తున్న పాఠశాలలను ఈ బృందం సందర్శించనుంది. ‘పాల్’ ప్రాజెక్టు అమలులో ఆంధ్రప్రదేశ్ అత్యంత ప్రాముఖ్యతగా నిలిచిందన్నారు. మూడు రోజుల పాటు ఏలూరు జిల్లాలో వివిధ పాఠశాలలను సందర్శించనున్నారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ అమలు తీరు గురించి చికాగో యూనివర్శిటీ బృందం పరిశోధించడం ఆనందకరమన్నారు. ఇలాంటి పరిశోధనలు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి మరింత దోహదపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడానికి ‘పాల్’ ప్రాజెక్టు చొరవ అపారమైనదని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏఎస్పీడీ కె.వి.శ్రీనివాసులురెడ్డి , శామో జాయింట్ డైరెక్టర్ బి.విజయ్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.