Leading News Portal in Telugu

MP Margani Bharat: చంద్రబాబు స్కామ్‌లలో పవన్ కల్యాణ్‌ పాత్ర.. వైసీపీ ఎంపీ అనుమానాలు..


MP Margani Bharat: చంద్రబాబు స్కామ్‌లలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పాత్రపైనా పలు అనుమానాలు ప్రజల్లో ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్.. పవన్ కల్యాణ్‌ మాటలు వింటుంటే ప్రజలకే కాదు.. తమ పార్టీ్కి కూడా నిజమేనేమో అనిపిస్తోందన్నారు. రాజమండ్రిలో భరత్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన దొందు దొందేనని, వారి మధ్య అండర్ స్టాండింగ్ ఉందని మొదట నుంచి తాము చెబుతూనే ఉన్నామని గుర్తుచేశారు. ఈ రోజు చంద్రబాబు ఆర్థిక నేరాల కారణంగా సెంట్రల్ జైలులో ఉండటం వల్ల పవన్ ఆవేశంతో చెప్పినట్లు నటిస్తున్నా.. సమయం వచ్చింది కాబట్టి ముసుగుతీశారన్నారు. బీజేపీతో తమకు సయోధ్య కుదుర్చమని పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు టాస్క్ ఇచ్చారని, అలాగే టీడీపీ ఎంపీలు నలుగురికి కూడా టాస్క్ ఇచ్చినా.. ఫెయిల్ కావడంతో .. పొత్తు డ్రామా ప్రారంభించారని ఎద్దేవా చేశారు.

‌చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రాజకీయ డ్రామాలు బీజేపీ అగ్రనేతలకు తెలియనదేమీ కాదని, అందుకే వీరిద్దరి నాటకాలు అక్కడ సాగలేదన్నారు‌ ఎంపీ భరత్‌. పవన్ నిన్న మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుతో అభిప్రాయ భేదాలు ఉన్నాయని, ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్న అంశం వల్లనే గత ఎన్నికలలో విడిగా పోటీ చేశానని చెప్పి.. మరి ఈ రోజు మళ్లీ పొత్తు ఎలా కుదిరింది అని ప్రశ్నించారు. గతంలో ఇదే పవన్.. లోకేష్ విపరీతమైన అవినీతి చేస్తున్నాడని, ఆయనే చేస్తున్నాడా? లేక తండ్రి చంద్రబాబుకు తెలిసే చేస్తున్నాడా? అని విమర్శలు చేయలేదా అని ప్రశ్నించారు. లోకేష్ పై నమ్మకం లేకనే దత్తపుత్రుడిని ముసుగు తీసి వచ్చేయమని చెప్పడంతో పవన్ కల్యాణ్‌ ‘పొత్తు’ ప్రస్తావనను తీసుకొచ్చారని.. ఈ విషయం మా పార్టీకి ఎప్పుడో తెలుసునన్నారు. చంద్రబాబు చిప్ పాతతరంది అలానే ఉందని, అప్ గ్రేడ్ కాలేదని సెటైర్లు వేశారు.

నాకు చిత్ర రంగంలో రోజుకు రూ.2 కోట్లు వస్తాయని.. పవన్ కల్యాణ్‌ ఎవరికి చెబుతున్నాడని ప్రశ్నించిన ఎంపీ భరత్.. చంద్రబాబుకు పరోక్షంగా తన ప్యాకేజీ పెంచమని సంకేతాలిచ్చినట్టు ప్రజలు భావిస్తున్నారని, లేకపోతే ప్రజల వద్దకు చెప్పాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ‌నేను పోరాటానికి సిద్ధం.. సిద్ధం అనడం‌ తప్పిస్తే పోరాటం వద్దని పవన్ కల్యాణ్‌ను ఎవరూ అనలేదు కదా..? గత 10 ఏళ్ల నుంచి పోరాటం చేయమనే చెబుతున్నామన్నారు.‌ ప్యాకేజీ కోసం వెంపర్లాడటం మాని పోరాటం చేస్తే మంచిదే అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాం అనకొండ లాంటి చంద్రబాబుకు చిన్నదేనని, ఈ స్కామ్ లో సూత్రధారి, పాత్రధారి చంద్రబాబు అండ్ టీమ్ సహా పవన్ కల్యాణ్‌ భాగస్వామ్యం కూడా ఉందని స్పష్టమవుతోందన్నారు. లోకేష్ ఢిల్లీ వెళ్లాడు.. అక్కడ ఏమి చెబుతాడు.. రూ.370 కోట్లు తీసుకోలేదని చెబుతాడా? అని ప్రశ్నించారు. ఒకవైపు ప్రధాని మోడీ జీ 20 శిఖరాగ్ర సదస్సుతో మన భారతదేశాన్ని‌ ప్రపంచ స్థాయిలో ఉన్నతంగా తీసుకొస్తుంటే.. చంద్రబాబు జర్ననీ ఇంటర్నేషనల్ కంపెనీ పేరుతో భారీ‌ స్కామ్ చేసి మన దేశ పరువు తీసేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ ఎంపీ భరత్.