Leading News Portal in Telugu

YSRCP and TDP: టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య ఆసక్తికర చర్చ..


YSRCP and TDP: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. సభలో వాయిదా తీర్మానానికి పట్టుబట్టడం.. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మీసాలు తిప్పడం, వైసీపీ ఎమ్మెల్యే తొడ గొట్టడం.. దమ్మంటే రా అంటూ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్‌ ఇవ్వడం.. పోటీపోటీగా పోడియం దగ్గరకు వైసీపీ, టీడీపీ సభ్యులు దూసుకురావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.. దీంతో.. సభను వాయిదా వేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. మరోవైపు ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై మేం చర్చకు సిద్ధం.. మేం అడిగే ప్రశ్నలకు సమాధాలను చెప్పడానికి టీడీపీ సిద్ధమా అంటూ మంత్రి బుగ్గన సవాల్‌ చేశారు..

ఇక, ఏపీ అసెంబ్లీ లాబీల్లోని టీడీఎల్పీ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, సత్యనారాయణ రాజు-మాజీ మంత్రి పేర్ని నాని మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది.. ప్రతిపక్షం హింసను కోరుకుంటోందని పేర్కొంటూ.. సభలో జరిగిన పరిణామాలను లాబీల్లో పేర్ని నాని వివరించారు.. అంతేకాదు.. బుచ్చయ్య చౌదరి మనస్సు చంపుకుని రాజకీయం కోసం పని చేస్తున్నారన్న పేర్కొన్నారు పేర్నిననా.. దీనికి బదులిస్తూ.. తాను రాజకీయం కోసం కాదు.. రాజ్యాంగం కోసం పని చేస్తున్నానన్నారు బుచ్చయ్య చౌదరి. ఇలా నేతల మధ్య కాసేపు చర్చ హాట్‌ హాట్‌గా సాగింది.

మరోవైపు.. అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ.. సభలో వైసీపీ సభ్యులు మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మేం వాళ్ల ట్రాప్ లో పడలేదు.. సభలో హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు. కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిని టార్గెట్ చేసేలా వైసీపీ సభ్యులు సభలో వ్యవహరించారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు అక్రమం అనే అంశ పైనే మా పోరాటం కొనసాగుతోందని ప్రకటించారు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌.