Minister Chelluboina Venu: వ్యవస్థల పట్ల టీడీపీ నేతలకు గౌరవం లేదని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు వ్యాఖ్యానించారు. సభ పట్ల టీడీపీ నేతలకు ఏమాత్రం గౌరవం లేదని.. నియమాలు ఉల్లంఘించి ప్రవర్తిస్తున్న మీ తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుకు కేటాయించిన కుర్చీ పైకి ఎక్కి బాలకృష్ణ ఈలలు వేశారని ఆయన తెలిపారు. టీడీపీ నేతల దగ్గర విషయం లేదని విమర్శించారు. చంద్రబాబు యువతకు ద్రోహం చేశాడని.. 5 రోజులు మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి యువతను మోసం చేశాడని ఆయన ఆరోపణలు చేశారు. చంద్రబాబు స్కిల్ స్కామ్లో ప్రధాన ముద్ధాయి అని అప్పటి అధికారులే చెప్పారని ఆయన వెల్లడించారు. చంద్రబాబుకు హాని తల పెట్టాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు.
చంద్రబాబును హత్య చేయాల్సిన అవసరం లోకేష్కు, ఆయన కుటుంబానికే ఉందని మంత్రి చెల్లుబోయిన వేణు పేర్కొన్నారు. ఏ తప్పు చేసినా తెలివిగా తప్పించుకోగలననే చంద్రబాబు స్కిల్ …స్కిల్ స్కామ్లో పారలేదన్నారు. సభాపతి, మండలి ఛైర్మన్ అంటే టీడీపీ నేతలకు గౌరవం లేదన్నారు. సభకు రానంటున్నారంటే నేరం అంగీకరించినట్లేనని వ్యాఖ్యానించారు. విషయం లేదు కాబట్టే టీడీపీ నేతలు సభ నుంచి పారిపోయారని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు సభలో ప్రతిపక్షం తీరు సభా చరిత్రలో దుర్ధినమంటూ మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు.