AP Assembly: రేపు(సోమవారం) మూడో రోజు ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రైతు రుణాలు, 9,10వ షెడ్యూల్లో ఆస్తులు, తూర్పు కాపులకు బీసీ ధృవ పత్రం, చంద్రన్న బీమా పథకం, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు, ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్లు, విద్యా దీవెన, వసతి దీవెన అంశాలపై ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నారు. రేపు అసెంబ్లీలో 9 కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవరణ బిల్లు -2023, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ బిల్లు -2023, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ సవరణ బిల్లు-2023 ఆంధ్రప్రదేశ్ భూదాన్ అండ్ గ్రామ దాన్ సవరణ బిల్లు, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ సవరణ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.
రేపు సభలో ఒక తీర్మానాన్ని సర్కారు ప్రవేశపెట్టనుంది. బుడ్గా జంగం సామాజిక వర్గాన్ని ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల జాబితాలో తిరిగి చేర్చాల్సిందిగా ప్రభుత్వం తీర్మానం చేసింది. కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.అసెంబ్లీ స్వల్పకాలిక చర్చలు జరగనున్నాయి. మహిళా సాధికారత- రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి అసెంబ్లీలో చర్చించనున్నారు. అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ, సమగ్ర భూ సర్వే, చుక్కల భూముల్లో సంస్కరణలు నంటి అంశాలపై చర్చ జరగనుంది.
శాసనమండలి ముందుకు రెండు బిల్లులు
రేపు ఉదయం పది గంటలకు మూడవ రోజు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంతో పెద్దల సభ ప్రారంభం కానుంది. చేనేత కార్మికులకు ఆర్థిక సాయం, పీఎం ఆవాస్ యోజన, దేవాలయ భూముల పరిరక్షణ, తిరుమల యాత్రికుల భద్రత, రాష్ట్రంలో మహిళా సాధికారత, ఆరోగ్యశ్రీ పథకం, దిశాపై మండలిలో ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. రేపు మండలి ముందుకు రెండు ప్రభుత్వ బిల్లులు రానున్నాయి. ఏపీ ఎస్ఎస్జీ గ్రూప్ బిల్లు -2023, ఏపీ ఆధార్ బిల్లు -2023 మండలి ముందుకు రానున్నాయి. దేవాలయాల అభివృద్ధి- ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.