Leading News Portal in Telugu

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. చంద్రప్రభ వాహనంపై ఉభయదేవేరులతో గోవిందుడు


Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు వివిధ వాహనాలపై తిరుమల మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. చంద్రప్రభ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో ఏడోరోజు రాత్రి శ్రీవారు చంద్రప్రభ వాహనంపై దివ్యమంగళ స్వరూపునిగా భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామి విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయన్నదని మనకు తెలిసిందే. చంద్రుని దర్శనం వల్ల మనస్సు నిర్మలంగా, ఉల్లాసంగా ఉంటుంది. అందుకే తిరుమలేశుడు తన భక్తులకు చల్లని చంద్రప్రభ వాహనంపై సుఖసంతోషాలను కల్గించేందుకు దర్శనమిచ్చారు.

ఇదిలా ఉండగా.. ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనం ఇచ్చారు. పరిమళ భరిత పూలమాలలు, విశేష ఆభరణాలతో అలంకృతులైన స్వామి వారు నాలుగు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, కోలాటాలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ వేష ధారణలతో వాహన సేవ ముందు ఆకట్టుకున్నాయి. సూర్యప్రభ వాహనంపై ఆసీనులై విహరిస్తున్న స్వామి వారిని దర్శించునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.