Leading News Portal in Telugu

Tirumala Brahmotsavam 2023: ముగింపు దశకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం!


Chakra Snanam Completed in Tirumala Salakatla Brahmotsavam 2023: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం పుష్కరిణిలో శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు. టీటీడీ చైర్మన్‌ భూమన, ఈవో ధర్మారెడ్డి ఈ వేడుకలో పాల్గొన్నారు. అంతకుముందు శ్రీవారు, ఉభయదేవేరులు, చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం చేశారు. అనంతరం శ్రీవారి పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు టీటీడీ అధికారులు అనుమతించారు.

బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నానం ఈరోజు ఉదయం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి, చక్రత్తాళ్వరుకు అర్చకులు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించారు. అనంతరం చక్రత్తాళ్వరుకు అర్చకులు పుష్కరిణీలో పవిత్ర స్నానం ఆచరించారు. ఇక సుదర్శన చక్రత్తాళ్వరును పుష్కరిణిలో పవిత్ర స్నానం తర్వాత భక్తులను పుణ్యస్నానాలకు అనుమతించారు. ఈరోజు సాయంత్రం వరకు చక్రస్నానం పవిత్రత ఉంటుందని, భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈరోజు రాత్రి నిర్వహించే ధ్వజావరోహణంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.