Leading News Portal in Telugu

Andhra Pradesh Crime: పెన్షన్‌ డబ్బు కోసం కొడుకు దారుణం.. నెలల తరబడి ఇంట్లోనే తల్లి మృతదేహం..


Andhra Pradesh Crime: ఎవరు మృతిచెందినా అయినవారికి, బంధుమిత్రులకు సమాచారం ఇచ్చి వీలైనంత త్వరగా అంత్యక్రియలు నిర్వహిస్తారు.. ఎవరైనా దగ్గరివారు దూర ప్రాంతంలో ఉంటే.. వాళ్లు వచ్చే వరకు అంత్యక్రియలు ఆపుతారు.. కానీ, ఓ కుమారుడు.. తన తల్లి మృతిచెందిన విషయాన్ని నెలల తరబడి దాచాడు.. ఏలూరులో వెలుగు చూసిన ఈ ఘటన కలకలం రేపుతోంది. తన తల్లి మృతి చెందినా.. ఆ విషయాన్ని నెలలు తరబడి గోప్యంగా ఉంచిన ఘటన వెలుగు చూడడంతో స్థానికులు నివ్వెర పోయారు. తల్లికి వచ్చే పెన్షన్ డబ్బు కోసం ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు తంగెళ్లమూడి యాదవ నగర్ ప్రాంతానికి చెందిన శరనార్ది నాగమణి అనే వృద్ధురాలు మృతి చెందింది.. అనే విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉండడంతో పెన్షన్ డబ్బుకోసం తల్లి మృతిచెందినా.. ఖననం చేయకుండా శవాన్ని గోప్యంగా ఉంచరని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. భవనంపై భాగంలో గదిలో మృతదేహంఉండగా కింది పోర్షన్ లో ఆమె కొడుకు బసవ ప్రసాద్ నివాసం ఉంటున్నాడు. బసవప్రసాద్ తో విభేదాలు కారణంగా భార్య అతనికి దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తల్లికి వచ్చే పెన్షన్ పైన ఆధారపడి బసవ ప్రసాద్ జీవనం సాగిస్తున్నాడు. వీరికి చుట్టుపక్కల వారితో కూడా సరైన సంబంధాలు లేకపోవడంతో వృద్ధురాలు మృతి చెందిన విషయం బయటికి రాలేదని చెబుతున్నారు.