AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి.. ఇప్పటికే నాలుగు రోజుల పాటు సమావేశాలు జరగగా.. ఐదో రోజు అనగా రేపటితో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి.. రేపు ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి అసెంబ్లీ సమావేశాలు.. అయితే, చివరి రోజు సభలో రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు -2023, ఏపీ అప్రోప్రియేషన్ బిల్లు -2023లను సభలో ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం.. ఇక, ప్రభుత్వ సెక్యూరిటీస్ యాక్ట్ 2006ను సవరించాలని కేంద్రానికి కోరుతూ సభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం.. మూడు అంశాల పై రేపు అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చలు సాగనున్నాయి.. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు లో అక్రమాల పై షార్ట్ డిస్కషన్ జరగబోతోంది.. ఆరోగ్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, దేవాలయాల అభివృద్ధి-ప్రభుత్వం తీసుకున్న చర్యల పై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.
మరోవైపు.. రేపటితో శాసన మండలి సమావేశాలు కూడా ముగియనున్నాయి.. రేపు ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్న మూడవ రోజు శాసన మండలి సమావేశాలు.. ప్రశ్నోత్తరాల సమయంతో పెద్దల సభ ప్రారంభం అవుతుంది.. మండలి ముందుకు సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లు రాబోతోంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాం పై రెండవ రోజు చర్చ కొనసాగనుంది.. వైద్య, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధి పై స్వల్ప కాలిక చర్చలు జరగనుండగా.. ప్రభుత్వ సెక్యూరిటీస్ యాక్ట్ 2006ను సవరించాలని కేంద్రానికి కోరుతూ సభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..