AP CID officers in Delhi: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోసం ఢిల్లీ వెళ్లారు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు.. హస్తినలో మకాం వేసిన లోకేష్ కోసం వెతుకులాట ప్రారంభించారు. లోకేష్ కోసం పలుచోట్ల సీఐడీ అధికారులు ఆరా తీసినట్టుగా తెలుస్తోంది.. కావాలనే సీఐడి అధికారుల నుంచి తప్పించుకుంటున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట అధికారులు. రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్కు 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి వెళ్లారట సీఐడీ అధికారులు.. నోటీసులు తీసుకుని విచారణలో అధికారులకు సహకరించాలని లోకేష్కు ఏపీ హైకోర్టు ఆదేశించిన విషయం విదితమే.. అయినా సీఐడీ అధికారులకు అందకుండా లోకేష్ దాగుడు మూతలు ఆడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు అధికారులు.. ఇక స్కిల్ స్కాం, ఫైబర్నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ ప్రయత్నాలు చేయడంతో.. లోకేష్ పిటిషన్లను కోర్టులో వ్యతిరేకించాలని సీఐడీ నిర్ణయించింది.. కాగా, ఏపీ హైకోర్టులో లోకేష్కు ఊరట లభించింది.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటు ఫైబర్నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు లోకేష్.. హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నారా లోకేష్ను ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్టోబర్ 4వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. ఇదే సమయంలో.. స్కిల్ డెవలప్మెంట్ కేసు వచ్చే నెల 4వ తేదీ వరకు వాయిదా వేసింది హైకోర్టు.