Leading News Portal in Telugu

Fact Check: డిజిటల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులపై కథనం.. అసలు నిజం ఇదే..!


Fact Check: ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలే అంటూ కథనాలు వచ్చాయి.. సాక్షి, ఏపీడీసీకి తేడా లేదు.. ఆ రెండింటి పని జగన్‌కు బాకా ఊదడమే.. ప్రభుత్వ భజనకు రూ.500 కోట్ల దోపిడీ.. అనుకూల వెబ్‌సైట్‌లు, యూట్యూబ్‌ ఛాన్ళకు డబ్బుల పందేరం.. అంటూ టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌ కుమార్‌ ఆరోపణలు గుప్పించినట్టు ఆ కథనం సారాశాం.. అయితే.. ఈ కథనాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఖండించింది.. ఇందులోని అంశాలన్నీ పూర్తిగా నిరాధారమైనవి. నిజాలకు పాతరేస్తూ వక్రీకరణలతో ఈ కథనం రాశారని.. FactCheck.AP.Gov.in స్పష్టం చేసింది..

అసలు ఏపీడీసీ అనేది కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌ కానేకాదు. గతంలో చంద్రబాబు హయాంలో ఏర్పాటుచేసిన ఏపీ కంటెంట్‌ కార్పొరేషన్‌ను మార్పు చేస్తూ దీన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 31–03–2020న చేసిన జీవో ఎమ్‌ఎస్‌ నంబర్‌ 19 ద్వారా 23–09–2020న ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ ఏర్పడింది. గత ప్రభుత్వం 14–12–2018న జీవో ఎమ్‌ఎస్‌ నంబర్‌ 4 ద్వారా ఏర్పాటుచేసిన ఏపీ కంటెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీసీసీ)ని పూర్తిగా మార్చి ఏపీడీసీని ఏర్పాటుచేయడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేనట్టుగా, ఈ ప్రభుత్వంలోనే కొత్తగా ఏర్పాటు చేసినట్టుగా ఒక అపోహ కలిగించేలా ప్రతిపక్షం ఆరోపణలు చేయడం, దాన్ని పతాక శీర్షికల్లో ఓ దినపత్రిక ప్రచురించడం వెనుక అసలు ఉద్దేశాలను ఇట్టే చెప్పొచ్చు అంటూ పేర్కొంది..

ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్, మెమోరాండం ఆఫ్‌ ఆర్టికల్స్‌లో ఏపీడీసీ లక్ష్యాలు, పాత్ర స్పష్టంగా వివరించడం జరిగింది. ఏపీడీసీ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ కార్యక్రమాలకు బహుళ ప్రాచుర్యం కల్పించడం, అలాగే ప్రభుత్వాన్ని నడుపుతున్న గౌరవ ముఖ్యమంత్రిగారి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం, తద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా పనిచేయడం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సహా అన్ని విభాగాల తరపున ఏపీడీసీ ప్రకటనలు రూపొందిస్తుంది. ప్రభుత్వాధినేతగా, ప్రభుత్వ సారథిగా, ఆ కార్యక్రమాల సృష్టికర్తగా గౌరవ ముఖ్యమంత్రిగారు ఈ ప్రకటనలన్నింటిలోనూ కనిపిస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకం కానేకాదు. మరి దీనిపై విమర్శలు చేయడం వెనుక ఆంతర్యం కేవలం బురదజల్లడమే. ప్రభుత్వాన్ని, ప్రభుత్వాన్ని నడిపే సారథిని ప్రమోట్‌ చేయడమనేది.. గత ప్రభుత్వంలో ఉన్న ఏపీ కంటెంట్‌ కార్పొరేషన్‌ చేసింది, ఇప్పుడున్న ఏపీడీసీ కూడా అదే చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పడ్డ ఏపీ కంటెంట్‌ కార్పొరేషన్‌ చేస్తే ఒప్పు… అదే కంటెంట్‌ కార్పొరేషన్‌ స్థానంలో పేరు మార్చుకుని ఏర్పాటైన ఏపీడీసీ చేస్తే తప్పు కాదు కదా. గత ప్రభుత్వ కార్యక్రమాలు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇమేజీని పెంచడానికి గ్రూప్‌ – ఎమ్‌ లాంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని, కోట్లాది రూపాయలు చెల్లించారు. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల డిజిటల్‌ ఇండియా మిషన్‌లో భాగంగా ఏపీడీసీ ఏర్పడింది. ఆ మిషన్‌ ఉద్దేశాలు, నిర్దేశించిన లక్ష్యాల్లో భాగంగా ఏపీడీసీ తన పనిని అద్భుతంగా నిర్వర్తిస్తోందని స్పష్టం చేశారు.

ఏపీడీసీపై ఆరోపించినట్టుగా వైయస్‌ఆర్‌ డిజిటల్‌ లైబ్రరీ కాన్సెప్ట్‌ అనేది అసలు ఏపీడీసీ పరిధిలోకే రాదు. అంతేకాదు, ఏపీడీసీ దానికి ఎగ్జిక్యూటింగ్‌ ఏజెన్సీ కూడా కాదు. ఇలాంటి పచ్చి అబద్ధాలను కూడా ప్రచారం చేయడం వారి ఆరోపణలు అవాస్తవాలు అనడానికి నిదర్శనం. ఇక, వ్యయం విషయానికొస్తే ఈ నాలుగున్నరేళ్లలో రూ.500 కోట్లు ఖర్చు చేశారనేది పూర్తిగా నిరాధారమైన ఆరోపణ. ఏపీడీసీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జీతాలు, కార్యక్రమాల ప్రమోషన్లపై చేసిన మొత్తం ఖర్చు రూ.88.56 కోట్లు మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ఐప్యాక్‌కు కూడా ప్రకటనలు ఇస్తున్నారన్నది పూర్తి అబద్ధం. ఐ ప్యాక్‌ అనేది ఎంప్యానెల్‌ అయిన ఏజెన్సీ కాదు. ఐప్యాక్‌కు ఏపీడీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలూ ఇవ్వలేదు. అలాగే ఐడ్రీమ్‌ కూడా ఎంప్యానెల్‌ అయిన ఏజెన్సీ కాదు. ఐడ్రీమ్‌కు కూడా ఏపీడీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలూ ఇవ్వలేదు. ఈ విషయంలో చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవం అని కొట్టిపారేశారు. అసత్యాలతో ఏపీడీసీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలను అప్రదిష్టపాలు చేసేందుకు కొన్ని అసాంఘిక శక్తులు పూనుకోవడం దురదృష్టకరం. ఈ చర్యలను ఏపీడీసీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఏపీడీసీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రయోజనాలు పరిరక్షించేందుకు సంబంధిత వ్యక్తులపై న్యాయపరమైన చర్యలను ఏపీడీసీ తీసుకుంటుందని వార్నింగ్‌ ఇచ్చింది.