Leading News Portal in Telugu

CM YS Jagan Samarlakota Tour: నేడు సీఎం జగన్ సామర్లకోట పర్యటన.. వారికి శుభవార్త..


CM YS Jagan Samarlakota Tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. దీని కోసం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్‌… ఉదయం 10 గంటలకు పెద్దాపురం చేరుకుంటారు.. అక్కడ 10 నిమిషాల పాటు స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్న ఆయన.. అనంతరం సామర్లకోటకు చేరుకోనున్నారు. జగనన్న కాలనీలో లబ్ధిదారుల ఇళ్ల పరిశీలన, వైఎస్సార్ విగ్రహ ఆవిష్కరణను నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు బహిరంగ సభ వేదిక వద్దకు సీఎం జగన్‌ చేరుకోనున్నారు. 40 నిమిషాల పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు సీఎం వైఎస్‌ జగన్‌.

ఇక, సామర్లకోటలో వైయస్సార్ జగనన్న కాలనీని ప్రారంభిస్తారు సీఎం వైఎస్‌ జగన్‌.. 57 ఎకరాలలో 2,412 ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. దశలవారీగా లబ్ధిదారులకు సర్కార్‌ ఇళ్లను అందజేస్తోంది. రెండు ప్రాంతాలలో జగనన్న లేఅవుట్లను ఏర్పాటు చేశారు. సెంటు స్థలంలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇళ్ల నిర్మాణం కోసం లక్షా 80 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసింది ప్రభుత్వం. ఇక, సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో కాకినాడ జిల్లాలో గురువారం ఉదయం 7 గంటల నుండి ట్రాఫిక్ ను వేరే మార్గాల గుండా మల్లిస్తున్నట్టు పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి తెలిపారు. కాకినాడ వైపు నుండి సామర్లకోట వైపునకు వచ్చే భారీ వాహనాలన్నీ అచ్చంపేట జంక్షన్ నుండి తిమ్మాపురం, పిఠాపురం బైపాస్ మీదుగా కత్తిపూడి హైవేకు దారి మళ్ళించడం జరిగిందని.. కాకినాడ, మాధవపట్నం వైపు నుండి వచ్చే హెవీ వెహికల్స్ ఉండూరు బ్రిడ్జి డౌన్ జంక్షన్ నుండి అచ్చంపేట బైపాస్ రోడ్డు మీదుగా మళ్లించామన్నారు..

ఇక, సామర్లకోట అయిదు తూముల సెంటర్ అయ్యప్ప స్వామి గుడి దగ్గర కటాఫ్ పెట్టుకుని ఉండూరు వైపు నుండి వచ్చే వాహనాలను మాధవపట్నం వైపునకు దారి మళ్ళిస్తున్నట్టు తెలిపారు. ఇంకా బిక్కవోలు, అనపర్తి వైపు నుండి సామర్లకోట వైపుకు వచ్చే భారీ వాహనాలన్నీ బిక్కవోలు, భలభద్రపురం మీదుగా దారి మళ్ళింపు చేశామని, రాజానగరం వైపు నుండి వచ్చే భారీ వాహనాలు పెద్దాపురం పాండవుల మెట్ట వద్దనుండి గుర్రాల సెంటర్ మీదుగా జగ్గంపేట హైవేకు దారి మళ్లింపు జరిగిందని వివరించారు.. వీటితో పాటు మరికొన్ని చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉన్నాయని.. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, రాష్ట్రంలో జగనన్న గృహ నిర్మాణ యజ్ఞం జరుగుతోంది.. 30.75 లక్షల ఇళ్ల పట్టాలు ఉచితంగా అందజేశారు.. 21.76 లక్షల ఇళ్లు నిర్మాణం జరుగుతోంది.. 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసి పేద అక్క చెల్లెమ్మలకు అందజేశారు సీఎం వైఎస్‌ జగ్మోహన్‌రెడ్డి.. మిగతా ఇల్లు వివిధ దశల్లో శరవేగంగా నిర్మాణ పనులు చేసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు.