
Undavalli Arun Kumar: స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరడం తప్పా అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తాను వ్యతిరేకమని సోషల్ మీడియాలో తనపై ట్రోల్ చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కేసులో ఉన్నవి సూట్ కేసు కంపెనీలు అంటూ ఉండవల్లి ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన ఫైల్ మాయంపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ఫైల్స్ టీడీపీ హయాంలోనా, వైసీపీ హయాంలోనైనా మాయం అయ్యింది ఎప్పుడో తేలాలన్నారు. చంద్రబాబు, జగన్, రాజశేఖర్ రెడ్డి ఎవరైనా కలెక్షన్ లేకుండా ఎలక్షన్ లేదన్నారు. కరప్షన్ లేకుండా ఏ నాయకుడు ఓటర్లకు డబ్బులు పంచలేదని ఆయన వ్యాఖ్యానించారు. నాయకులు ఆస్తులు అమ్ముకుని ఎన్నికలలో ఖర్చు పెట్టినట్లు చరిత్రలో లేదన్నారు.
చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపు చర్యేనని.. సంచలన కేసు కొట్టేసే ధైర్యం ఏ న్యాయమూర్తి అయిన చేస్తారా అంటూ ఆయన పేర్కొన్నారు. క్వాష్ పిటిషన్ను కొట్టేయాలని చంద్రబాబు లాయర్లు ఎందుకు కోరుతున్నారో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదంటే కచ్చితంగా హాస్పిటల్లో చేర్చాలని.. చందబాబు వయస్సు, హోదా రీత్యా, గెస్ట్ హౌస్ లోగాని, ఇంటిలోగాని నిర్బంధించవచ్చన్నారు. లాలుప్రసాద్ యాదవ్కు ఇదే సౌకర్యం కల్పించారన్నారు. సీబీఐ విచారణకు ఆదేశిస్తే చంద్రబాబుకు, జగన్కు మంచిదేనని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఈ స్కాంలో డబ్బులు ముట్టినట్లు ఆధారాలు లేవనేది వాస్తవమని.. చంద్రబాబు పీఏ అకౌంట్లోకి డబ్బులు వెళ్లాయనేది నిజమన్నారు. ఉండవల్లి అరుణ్కుమార్ మాట్లాడుతూ..” 17A వర్తిస్తే జగన్ పై కేసులే ఉండవు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చాలా బాగుంటుంది. జైలుకు వెళ్లి వచ్చిన స్థానిక టీడీపీ నేతలే ఈ విషయం చెప్పారు. ఈ కేసును ఎంత కూల్గా తీసుకుంటే అంత మంచిదని” ఉండవల్లి సలహా ఇచ్చారు.
“చంద్రబాబుతో పవన్ పొత్తు తొందరపాటు చర్య. పవన్ నన్ను అడిగి ఉంటే కొద్ది రోజులు ఆగమని చెప్పే వాడిని. పవన్ కలవడం వల్ల టీడీపీకి మంచిది. పవన్ కొద్ది రోజులు ఆగి పొత్తుకు వెళ్లితే బాగుండేది.” అని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.