Saraswathi Alankaram: సరస్వతీ దేవిగా బెజవాడ దుర్గమ్మ దర్శనం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

Saraswathi Alankaram: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి.. శరన్నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు సరస్వతీదేవి అలంకారంలో దర్శనం ఇస్తున్నారు కనకదుర్గమ్మ.. సరస్వతీదేవి అలంకారంలో దర్శనం ఇస్తున్న అమ్మవారిని దర్శించుకుంటే విద్యార్ధులకు విద్యాబుద్ధులు అబ్బుతాయని, మంచి నడవడిక వస్తుందని నమ్ముతారు.. రాత్రి నుంచి క్యూలైన్లలో ఇంద్రకీలాద్రి దిగువన వినాయక ఆలయం దగ్గర నుంచి భక్తులను వదులుతున్నారు అధికారులు.. మరోవైపు.. శుక్రవారం కూడా కావడంతో భారీగా తరలి వస్తున్నారు భక్తులు.. హోల్డింగ్ ఏరియా, క్యూలైన్లలో భారీసంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు.. ఇక, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారిని దర్శించుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
దసరా ఆరవరోజు సరస్వతీదేవి అలంకారంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం ఇస్తుండగా.. మూల నక్షత్రం కావడంతో అర్ధరాత్రి నుంచీ క్యూలైన్లలోనే భక్తులు వేచిఉన్నారు.. మూల నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.. వినాయక ఆలయం వద్ద నుంచి విడతల వారీగా క్యూలైన్లలో భక్తులను వదులుతున్నారు ఆలయ అధికారులు, పోలీసులు.. ఈ రోజు లక్షలాదిగా భక్తులు ఇంద్రకీలాద్రికి తరలిరానున్నారు. మూడు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.