
విజయవాడలోని ఇందీరాగాంధీ స్టేడియంలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నేడు మన ప్రభుత్వం తరపున నిర్వహించాం.. ఈ ఏడాది మన రాష్ట్రంలో విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సోదరుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.
సమాజ భద్రత కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడే పోరాట యోధుడే పోలీస్ అని సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. అధునాతన వ్యవస్థలను ఉపయోగించుకుని నేరాలకు పాల్పడుతున్న వారిని ఎదుర్కోవలసిన బాధ్యత నేటి పోలీసులపై ఉంది అని ఆయన తెలిపారు. నేర నిరోధం, నేర దర్యాప్తులో మన రాష్ట్ర పోలీసులు అత్యాధునిక సైబర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ దేశంలోనే అగ్రగామిగా ఉన్నారు.. ఈ విభాగంలో నియమించిన 130 మంది సాంకేతిక పోలీసింగ్ నిపుణుల పనితీరు మన ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తోంది అని సీఎం జగన్ కితాబు ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రతి పోలీసుకు ఇన్యూరెన్స్ కింద రూ. 30 లక్షల నుంచి రూ.75 లక్షల బీమా కవరేజీ ఇచ్చేందుకు ఎస్బీఐ ముందకొచ్చిందని సీఎం జగన్ వెల్లడించారు. ఈ మేరకు ఆ బ్యాంకుతో నెగోషియేషన్ పూర్తియిందని ఆయన ప్రకటించారు. అయితే, పోలీసులు అప్డేట్ కావ్వాల్సిన పరిస్థితి ఉందని.. ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్ నెట్ వాడకం ద్వారా సైబర్ ప్రపంచంలో చీకటి ప్రపంచం సృష్టించుకున్న వారిని ఎదుర్కోవలని ఆయన తెలిపారు.