Leading News Portal in Telugu

Seediri Appalaraju: పురంధేశ్వరి చంద్రముఖిగా మారారు.. టీడీపీలో చేరితే సరిపోతుంది కదా..?


Seediri Appalaraju: పురంధేశ్వరి చంద్రముఖిగా మారారు.. టీడీపీలో చేరితే సరిపోతుంది కదా..?

Seediri Appalaraju: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి ఫురంధేశ్వరి.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు మంత్రి అప్పలరాజు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగనన్న పాలవెల్లువ పథకంపై జనసేన, టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చారు.. ఆ తర్వాత చంద్రబాబు కొడుక్కి లేని నొప్పి పవన్ కల్యాణ్‌కు ఎందుకు అని ప్రశ్నించారు. టీడీపీ – జనసేన ఎప్పుడూ కలిసే ఉన్నాయన్న ఆయన.. జనసేన కార్యకర్తల కష్టాన్ని రేటు కట్టి పవన్ కల్యాణ్‌.. టీడీపీకి అమ్మటం దారుణం అన్నారు. తండ్రి జైల్లో ఉంటే ఢిల్లీకి పారిపోయి మసాజ్ చేయించుకున్న వ్యక్తి లోకేష్ అంటూ సెటైర్లు వేశారు.

ఇక, పురంధేశ్వరి ప్రతి రోజూ మద్యం బ్రాండ్లను టేస్ట్ చేస్తున్నారేమో.. నేను మద్యం తాగను.. నాకు ఆ టేస్ట్ ల పై అవగాహన లేదంటూ సెటైర్లు వేశారు అప్పలరాజు.. ఇప్పుడు ఉన్న బ్రాండ్లు అన్నీ చంద్రబాబు హయాంలో వచ్చినవే అని పురంధేశ్వరికి తెలియదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ లు పట్టుకుని పురంధేశ్వరి రాజకీయాలు చేయకూడదు అని సూచించారు. పురంధేశ్వరి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాస్త గౌరవం ఉండేది.. కానీ, ఇప్పుడు ఆమెకు బీజేపీలోనే మద్దతు లేదన్నారు.. పురంధేశ్వరి చంద్రముఖిగా మారారు అంటూ విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినప్పుడు పోయిన గౌరవం.. పురంధేశ్వరి.. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు వచ్చిందన్నారు.. కానీ, ఇప్పుడు ఆ గౌరవం పోవడమే కాదు.. బీజేపీలోనే ఆమెకు మద్దతు లేదన్నారు. ఈ మాత్రం దానికి బీజేపీ అధ్యక్షురాలుగా ఉండటం ఎందుకు? టీడీపీలో చేరితే సరిపోతుంది కదా? అని ప్రశ్నించారు మంత్రి అప్పలరాజు.