Leading News Portal in Telugu

Kakani Govardhan Reddy: పురంధేశ్వరికి నెల్లూరులో ఎన్ని కాలువలు ఉన్నాయో తెలీదు..


Kakani Govardhan Reddy: పురంధేశ్వరికి నెల్లూరులో ఎన్ని కాలువలు ఉన్నాయో తెలీదు..

Kakani Govardhan Reddy: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భూములకు హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. దీనివల్ల 20 ఏళ్లుగా భూమిని సాగు చేస్తున్న వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో కరవు మండలాలను ఏ విధంగా ప్రకటిస్తారనే విషయం టీడీపీ నేతలకు అర్థం కావడం లేదన్నారు. దీనికి కేంద్ర మార్గదర్శకాలు ఉన్నాయన్న మంత్రి.. ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని కరవును నిర్దారిస్తారన్నారు. ఈ నిబంధనలకు అనుగుణంగా కరవు మండలాలను ప్రకటించారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. కానీ కొన్ని మీడియాలలో మాత్రం నిత్యం ఏదో ఒకటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

పురంధేశ్వరికి నెల్లూరులో ఎన్ని కాలువలు ఉన్నాయో తెలీదని ఆయన విమర్శించారు. రెండు కాలువలకు నీళ్లు ఇచ్చారని ఆమె చెప్పిందని.. కాలువలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. ఆమె తెలుసుకుని మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. సోమిరెడ్డి లాంటి వాళ్ళు రాసిస్తే చదివినట్లుందని ఆయన విమర్శించారు. తప్పు లేని దాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని..వాస్తవాలు వారికి తెలుసన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటోంది.. ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం స్పందిస్తోందన్నారు. టీడీపీ, జనసేనలు కింది స్థాయిలో కొట్టుకుంటున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. జిల్లాలో సాగునీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా చూస్తామని మంత్రి స్పష్టం చేశారు.