
CM YS Jagan: వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ వినియోగం పై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.. డిసెంబర్20 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేయాలని.. ప్రతి ఒక్కరి ఫోన్లో ఆరోగ్య శ్రీ, దిశ యాప్లు ఉండాలని.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సకాలానికి మందులు అందించాలని.. ఆస్పత్రుల్లో ఎక్కడా సిబ్బంది లేదనే మాట వినపడకూడదు, ఖాళీలు ఉండకూడదని స్పష్టం చేశారు.. ప్రజారోగ్య రంగంలో ఆరోగ్య శ్రీ అన్నది విప్లవాత్మక మార్పుగా అభివర్ణించారు.
ఇక, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు, పురోగతిని సీఎం జగన్కు వివరించారు అధికారులు. జగనన్న ఆరోగ్య సురక్ష పై నిరంతరం సమీక్ష చేయాలి.. ఆరోగ్య సురక్షలో మూడు ప్రధాన అంశాలపై దృష్టి సారించాలి.. రోగులకు మందులు అందించడం, అనంతరం ఫాలో అప్ చేయాలి.. చికిత్స అవసరమైన వారిని ఆస్పత్రులకు పంపించేటప్పుడు వారికి రవాణా ఖర్చుల కింద రూ.500లు ఇవ్వాలి అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు సీఎం జగన్.. కంటి చికిత్సలు కాకుండా ఇతర వైద్య చికిత్సలు అవసరమైన వారు 86,690 మంది ఉన్నారు.. ఇందులో 73,602 మందిని ఇప్పటికే చికిత్సకు పంపించామని వెల్లడించారు అధికారులు. వీరందరికీ పరీక్షలు చేసిన తర్వాత వీరిలో చాలామందికి వైద్యులు మందులు ఇచ్చారని తెలిపారు. వైద్య పరీక్షల ఫలితాలు తర్వాత 16,128 మందిని అడ్మిట్ చేశారన్న అధికారులు. ఇందులో 15,786 మందికి సర్జరీలు, ట్రీట్మెంట్లు పూర్తయ్యాయని వెల్లడించారు.
అయితే, ఇన్పేషెంట్లుగా చేరిన వారిపై మరోసారి పరిశీలన చేయాలన్నారు సీఎం.. డాక్టర్ల బృందాలను ఏర్పాటు చేసి అందిస్తున్న వైద్యంపై మరోసారి పరిశీలన చేయాలన్నారు. ఇక, 78,292 మందికి కంటిచికిత్సలు అవసరమని జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా గుర్తించామన్నారు అధికారులు. 13,614 మందికి ఇప్పటికే కాటకాక్ట్ చికిత్సలు చేయించామన్నారు. కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న మరో 7,272 మందికి చికిత్సలు అందించామని తెలపగా.. మిగిలిన వారికి కూడా నాణ్యమైన చికిత్సలు అందించేలా చూడాలన్నారు సీఎం జగన్.. షుగర్, రక్తపోటుతో బాధపడుతున్న వారికి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. టీబీ నిర్ధారణ అయిన వారికి చికిత్స అందిస్తున్నామన్నారు. జగనన్న సురక్ష శిబిరాల్లో గుర్తించిన రోగులకు సకాలానికే మందులు ఇచ్చేలా అన్ని ఏర్పాట్లూ చేశామన్న అధికారులు. ఇచ్చిన మందులు అయ్యేలోగా మళ్లీ మందులు పంపించేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు సీఎం.. దిగువస్థాయి వైద్య సిబ్బంది నుంచి సకాలానికే ఇండెంట్ వస్తే వారికి తగిన సమయానికి మందులు ఇచ్చేందుకు వీలు అవుతుందన్నారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రతి గ్రామానికీ వెళ్తున్నందున అదే సమయంలో వారికి మందులు అందాయా? లేవా? అన్న దానిపై పరిశీలన చేయాలని సూచించారు. ఈ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలన్నారు.
ఇక, జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం–2 రెండోదశ కార్యక్రమాలు నిర్వహించాలి.. రూరల్ ప్రాంతాల్లో ప్రతి మండలంలో ప్రతివారం ఆరోగ్య సురక్ష క్యాంపు.
క్యాంపుల వద్దే అవసరమైన వైద్య పరీక్షలు. క్యాంపుల్లో స్పెషలిస్టు వైద్యులు పాల్గొంటారని తెలిపారు సీఎం జగన్. 2023–24లో నవంబర్ నెలాఖరు వరకూ 12,42,118 మంది ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చికిత్స తీసుకున్నారని వెల్లడించారు అధికారులు. గత ఏడాదితో పోలిస్తే 24.64 శాతం అధికంగా ఆరోగ్య శ్రీ చికిత్సలు తీసుకున్నారని తెలిపారు. మరోవైపు.. చైనాలో విస్తరిస్తున్న హెచ్ 9 ఎన్ 2 వైరస్ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆస్పత్రుల వారీగా ఉన్నమౌలిక సదుపాయాలపై సమీక్షచేయాలన్నారు. అయితే, అన్నిరకాలుగా అప్రమత్తంగా ఉన్నామన్న అధికారులు. బోధనాసుపత్రులు, పీడియాట్రిక్ హెచ్ఓడీ విభాగాలు, పల్మనాలజీ, జనరల్ మెడిసన్ విభాగాల్లో తగిన సదుపాయాలు కల్పనపై దృష్టిపెట్టామన్నారు. ఇక, ఆస్పత్రుల్లో ఎక్కడా కూడా ఖాళీలు లేకుండా చూడాలని, ఇది లక్ష్యంగా ఉండాలని స్పష్టంచేశారు సీఎం వైఎస్ జగన్.