Leading News Portal in Telugu

AP Inter and 10th Exams: మార్చిలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు: మంత్రి బొత్స


AP Inter and 10th Exams: మార్చిలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు: మంత్రి బొత్స

AP Intermediate and 10th Exams: 2023-24 ఇంటర్, పదవ తరగతి పరీక్షలు మార్చి నెలలో నిర్వహించనున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ వల్ల పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను అవసరమైతే భవిష్యత్‌లో విడుదల చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. మొత్తం 16 లక్షల మంది విద్యార్థులు ఇంటర్, పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని మంత్రి చెప్పారు. పదవ తరగతి విద్యార్థులు 6 లక్షల మంది, రెండేళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థులు 10 లక్షల మందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు.

మార్చి 1 నుంచి మార్చి 15 వరకు ఇంటర్మీడియట్‌ థియరీ పరీక్షల తేదీలను విద్యా శాఖ ఖరారు చేసింది ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఒక రోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఉంటే.. రెండో రోజు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్ష నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 18 నుంచి మార్చి 31 వరకు 12 రోజుల పాటు పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 9.30 నుంచి 12.45 నిమిషాలకు వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.

రాష్ట్రంలో దురదృష్టకరమైన వాతావరణం ఉందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ట్యాబ్‌ల ద్వారా డిజిటల్ విద్య కావాలో వద్దో తల్లిదండ్రులు చెప్పాలన్నారు. ట్యాబుల్లో పాఠాల కంటెంట్ కాకుండా వేరే వీడియోలు రాకుండా లాకింగ్ సిస్టం పెట్టామన్నారు. వాటీజ్ దిస్ నాన్సెన్స్ ఇంగ్లీష్ మీడియం పెడితే పేద పిల్లల మీద ఎందుకు ఇంత అక్కసు అంటూ ఆయన మండిపడ్డారు.