Leading News Portal in Telugu

CM YS Jagan: 35 ఏళ్లుగా కుప్పానికే ఏమీచేయని వ్యక్తి.. రాష్ట్రానికి ఏం చేస్తారు..?



Ys Jagan

CM YS Jagan: 35 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయని చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం చేస్తారు? అని ప్రశ్నించారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కుప్పం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. పండుగ వాతావరణంలో సభ జరగడం ఆనందంగా ఉందన్నారు. 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి కృష్ణమ్మను కుప్పం కు తీసుకురావడం ఎంతో సంతోషం.. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించల్సిన సందర్భం.. నేను ఎంతో గర్వపడుతున్నాను అన్నారు. లాభాలు ఉన్న పనులే చంద్రబాబు చేశారు.. నేను ఇది వరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఇది చేశాను.. మరో రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం అన్నారు.

కుప్పంలో ఒక టీఎంసీ సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లను 535 కోట్ల రూపాయలతో నిర్మిస్తాం.. దీని వల్ల అదనంగా 5 వేల ఎకరాలకు సాగు నీరు లభిస్తుందని తెలిపారు సీఎం జగన్‌.. 35 ఏళ్లుగా ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గా, మూడు సార్లు సీఎం అయిన చంద్రబాబు.. ఎందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయలేక పోయారు.? అని నిలదీశారు. కుప్పంకే ప్రయోజనం లేని నాయకుడు వల్ల రాష్ట్రానికి ఏమీ ప్రయోజనం జరుగుతుంది..? అని ప్రశ్నించారు. తనకు భారీ వాటా ఇచ్చేవారికే ఈ ప్రాజెక్ట్ పనులు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన చేశాడని.. కానీ, ఎంతో చిత్తశుద్ధితో ఈ పనులు మేము పూర్తి చేశాం.. తనకు లాభాలు తెచ్చి, జేబులు నింపే పనులు చేసి, మిగిలిన పనులు చంద్రబాబు వదిలేశాడు ఫైర్‌ అయ్యారు.

ఇక, చంద్రబాబును భరిస్తున్న కుప్పం ప్రజల సహనానికి నా జోహార్లు అంటూ హాట్‌ కామెంట్లు చేశారు సీఎం జగన్.. చంద్రబాబుకు మించి కుప్పం వాసులకు నేను మేలు చేశానన్న ఆయన.. కుప్పంలో 87 వేల కుటుంబాలు ఉండగా, ఇందులో 82 వేల కుటుంబాలు మా పథకాలు అందుకున్నాయి .. ప్రతిఒక్కరూ బ్యాంక్ లకు వెళ్లి స్టేట్ మెంట్ లు తీసుకోండి. ఎంత డబ్బులు వచ్చాయో చూసుకోండి అని అని సూచించారు.. కుప్పం మరో 15 వేల ఇళ్లకు పట్టాలు ఇవ్వనున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు. చంద్రబాబు చంద్రగిరిలో ఓడిపోయాడు.. బీసీ సీటు కబ్జా చేసి, చంద్రబాబు ఇక్కడ ఎమ్మెల్యే గా ఉంటున్నారు.. కుప్పం ప్రజలు చంద్రబాబుకు చాలా ఇచ్చారు. మరి కుప్పం ప్రజలకు ఆయన ఏమి ఇచ్చాడు..? అని నిలదీశారు.

70 ఏళ్ల వయస్సులో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాడని దుయ్యబట్టారు సీఎం జగన్‌.. బీసీలు ఎక్కువ ఉన్న చోటు కూడా వారికి టిక్కెట్ ఇవ్వలేదని మండిపడ్డారు. తలుపులు బిగించుకొని పవన్ కల్యాణ్‌తో ప్యాకేజ్ గురించి మాట్లాడుతాడు అని ఆరోపించారు. కాపులకు టీడీపీ చేసిందేమిటి…? అని ప్రశ్నించిన ఆయన.. బలహీన వర్గాల ప్రతినిధి గా భరత్ ను ఎమ్మెల్సీ చేశాను. ఇప్పుడు భరత్ ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపించండి… కేబినెట్‌లో చోటు ఇచ్చి ఆయనను మంత్రిని చేస్తాను అన్నారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంజి కారు ఇస్తామని మేనిఫెస్టోలో పెడతాడు అంటూ ఎద్దేవా చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.