
YSRCP Focus on Vangaveeti Radha: ఎన్నికల వేళ.. ఏపీలో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. వైసీపీలో అసంతృప్తులంతా ఎవరి దారి వారు చూసుకుంటుంటే.. టికెట్ల ప్రకటన తర్వాత టీడీపీ, జనసేనలో మొదలైన లుకలుకలను ఆయుధంగా మార్చుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వంగవీటి రాధాను మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. వంగవీటి రాధాపై వైసీపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాధాను తిరిగి వైసీపీలోకి తీసుకువచ్చేందుకు కృష్ణా జిల్లా వైసీపీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. రాధాతో మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని మంగళవారం సమావేశమయ్యారు. వైసీపీలో చేరాలని, బందరు ఎంపీ సీటు రెడీగా ఉందని ప్రతిపాదించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి.
Read Also: Minister Dharmana Prasada Rao: అన్ని రంగాలలో జగన్ మార్పులు తెచ్చారు.. చర్చకు సిద్ధమా?
ఇదిలా ఉండగా.. వైసీపీలో చేరికపై రాధా నుంచి క్లారిటీ రాలేదని సమాచారం. గతంలోనే రాధా వైసీపీలో చేరాలని పలు సమావేశాలు జరిపారు వైసీపీ కీలక నేతలు. టీడీపీ నుంచే రాధాకు పోటీ చేసే అవకాశం వస్తుందని భావిస్తున్నట్టు రాధా వర్గం చెబుతోంది. రాధాకి టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం జరిగిన బెజవాడ సెంట్రల్, ఈస్ట్ టికెట్లను ఇప్పటికే చంద్రబాబు అనౌన్స్ చేయడం గమనార్హం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. టికెట్ల ప్రకటనలతో రాజకీయం వేడెక్కుతున్న సమయంలో రాధాను కొడాలి నాని డైరెక్ట్గా పార్టీలోకి ఆహ్వానించడంతో.. ఏం జరగబోతోంది.. విజయవాడ పాలిటిక్స్లో సంచలనాలు చూడబోతున్నామా అనే చర్చ జరుగుతోంది.