Leading News Portal in Telugu

AP Weather: ఏపీలో చల్లబడ్డ వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షం



Ap Rain

తీవ్ర ఎండలకు అల్లాడిపోతున్న ఏపీ జనం ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో.. ప్రజలు వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. కొన్ని చోట్ల వాతావరణం చల్లబడగా.. మరికొన్ని చోట్ల వర్షం కురుస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో.. నగరం అతలాకుతలం అయ్యింది. కొద్ది రోజులుగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతో వడగాల్పులకు ఇబ్బంది పడిన ప్రజలు సేద దీరారు. భారీ వర్షానికి కార్లు, బైక్లు నీటిలో కొట్టుకుపోయాయి. పది మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. కంభాల చెరువు వద్ద వర్షపు నీటిలో చిక్కుకుంది.‌ అంతేకాకుండా.. నగరంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చెట్లు నేలకు ఒరగడంతో విద్యుత్, కేబుల్ వైర్లు తెగిపడ్డాయి.

Read Also: Russia: ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ప్రమాణ స్వీకారం

మరోవైపు.. అటు విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మబ్బులు, ఈదురు గాలులతో వాతావరణం చల్లబడింది. వాతావరణం చల్లబడటంతో నగర ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. కారుమబ్బులు కమ్ముకోవడంతో నగరం చీకటిగా మారింది. ఎన్టీఆర్ జిల్లాలో కూడా భారీ వర్షం పడింది. తిరువూరులో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. అకాల వర్షంతో.. మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలోని పలు గ్రామాలో ఓ మోస్తారు వర్షం కురుస్తుంది. అటు.. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల, దేవరపల్లిలో భారీ వర్షం కురుస్తుంది. వర్షం దాటికి మామిడి, జీడిమామిడి, వరి, మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.నిన్న తిరుమలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.

Read Also: Ram Charan: బాబాయ్ కి అబ్బాయి సపోర్ట్.. ఆ వీడియో షేర్ చేస్తూ!